లోక్‌సభ పోల్స్ తర్వాత మరింత పెరిగిన రాహుల్ గాంధీ దూకుడు.. US టూర్‌లో వ్యాఖ్యలతో రాజకీయ దుమారం

అమెరికా పర్యటనలో రాహుల్ చేసిన కామెంట్స్ దుమారం లేపుతున్నాయి. మోదీ, RSS టార్గెట్‌గా విమర్శల దాడి పెంచుతున్నారు.

Rahul Gandhi: పొలిటికల్ సెన్సేషన్. ఫైర్ బ్రాండ్ పాలిటిక్స్‌కు కేరాఫ్. అతని ప్రతి మాట ఇప్పుడో పెద్ద సంచలనం. తానిచ్చే ప్రతి స్టేట్‌మెంట్ చర్చనీయాంశమే. గడ్డుకాలం అయిపోయింది. సీన్ మారింది. ఇప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడే ప్రతీమాటకు బీజేపీ ఆలోచించి సమాధానం చెప్పే పరిస్థితి వచ్చేసింది. ఒకప్పుడు రాహుల్ ఏ కామెంట్ చేసినా లైట్ తీసుకున్న కమలనాథులు ఇప్పుడు ప్రతీ చిన్న మాటకు కౌంటర్ ఇవ్వడం లేకపోతే సంజాయిషీ ఇచ్చుకుంటున్నారు. అంతలా కమలం పార్టీ కళ్లలో నలుసులా మారారు రాహుల్ గాంధీ.

మోదీ, RSS టార్గెట్‌గా విమర్శల దాడి
అమెరికా పర్యటనలో రాహుల్ చేసిన కామెంట్స్ దుమారం లేపుతున్నాయి. మోదీ, RSS టార్గెట్‌గా విమర్శల దాడి పెంచుతున్నారు. మోదీ అంటే విద్వేషం లేదంటూనే మాటల బాణాలు ఎక్కుపెడుతున్నారు. యూఎస్ టూర్‌లో రాహుల్ చేస్తున్న వ్యాఖ్యలు కాంట్రవర్సీ అవుతున్నాయి. సిక్కులు భారతదేశంలో తలపాగా పెట్టుకోవడానికి, గురుద్వారాకు వెళ్లడానికి అనుమతించబోతున్నారా లేదా అనేదానిపై పోరాటం అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం సిక్కులకే కాదు, అన్ని మతాలకు సంబంధించిన విషయమంటూ కామెంట్‌ చేశారు రాహుల్.

2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత పీఎం మోదీ పట్ల ఉన్న భయం పోయిందంటున్నారు రాహుల్. ఎన్నికల తర్వాత ఏదో మార్పు వచ్చిందని.. అంతకముందు ప్రధాని మోదీ భయానక వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నించారన్నారు. వివిధ ఏజెన్సీలు, మీడియా, ఐటీ చిన్న, మధ్య తరహా వ్యాపారాల్లో కూడా భయాన్ని కల్పించే ప్రయత్నం జరిగిందన్నారు. కానీ అవేమీ పని చేయలేదని.. అందరిలో భయం మాయమైందంటున్నారు. మోదీ ప్రభావం తగ్గిపోయిందని.. 56 ఇంచుల ఛాతీ, దేవుడితో ప్రత్యక్ష సంబంధం అంతా పోయిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ.

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ సీరియస్‌
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ సీరియస్‌గా రియాక్ట్ అవుతోంది. విదేశీ గడ్డపై భారత్ పరువు తీసేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారని.. సిక్కుల ఊచకోతకు ఎవరు కారణమో రాహుల్ సమాధానం చెప్పాలంటూ ప్రశ్నిస్తోంది. లోక్‌సభలో ప్రతిపక్ష హోదాలో ఉన్న రాహుల్ బాధ్యతాయుతంగా మాట్లాడటం నేర్చుకోవాలంటూ సూచిస్తున్నారు కమలనాథులు.

Also Read : బీజేపీ ఉన్నంతకాలం అలా జరగనివ్వం.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియపై కూడా విమర్శలు చేశారు రాహుల్. ఎన్నికలు పారదర్శకంగా జరిగినట్లు తాను భావించట్లేదని.. ఫేర్ ఎలక్షన్ జరిగితే బీజేపీకి 240 సీట్లు కూడా వచ్చేవి కావంటున్నారు రాహుల్. ఆర్థిక అండతో పాటు ఎన్నికల సంఘం కూడా బీజేపీకి ఏం కావాలో అదే చేసిందని.. తమ బ్యాంకు అకౌంట్లను సీజ్ చేసి ప్రచారంపై దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారన్నారు రాహుల్.

బీజేపీ తీరుపై తీవ్రస్థాయి విమర్శలు
అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లిన రాహుల్.. NRIల మీటింగ్‌లో బీజేపీ తీరుపై తీవ్రస్థాయి విమర్శలు చేస్తున్నారు. రోజురోజుకు పెరుగుతోన్న రాహుల్ గ్రాఫ్.. NRIల్లో వస్తున్న స్పందన చూసి బీజేపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రాహుల్ ప్రతి మాటలో నిజం ఉందని.. బీజేపీ వ్యవస్థలను నాశనం చేసిందని.. దేశాన్ని ఆగం పట్టించిందని ఘాటుకు కౌంటర్ ఇస్తోంది హస్తం పార్టీ. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ యూఎస్ టూర్‌లో చేసిన వ్యాఖ్యలు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా డైలాగ్‌వార్‌కు తెరదీశాయి. ఇది ఎటు టర్న్ తీసుకుంటుందోనన్న చర్చ జరుగుతోంది.

ట్రెండింగ్ వార్తలు