Rajiv Gandhi Murder Case: రాజీవ్ గాంధీ హత్యకేసులో సుప్రింకోర్టు కీలక తీర్పు..
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో సుప్రింకోర్టు బుధవారం కీలక తీర్పును వెలువరించింది. రాజీవ్ హత్యకేసులో 31ఏళ్లుగా జైలు జీవితం గడిపిన (యావజ్జీవ ఖైదీల్లో ఒకరైన) ఏజీ పెరరివలన్ను...
- Harishth Thanniru
- Published On : May 18, 2022 / 11:45 AM IST
Perarivalan (1)
Rajiv Gandhi Murder Case: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో సుప్రింకోర్టు బుధవారం కీలక తీర్పును వెలువరించింది. రాజీవ్ హత్యకేసులో 31ఏళ్లుగా జైలు జీవితం గడిపిన (యావజ్జీవ ఖైదీల్లో ఒకరైన) ఏజీ పెరరివలన్ను విడుదల చేయాలని సుప్రికోర్టు తీర్పునిచ్చింది. ఏజీ పెరరివలన్ను జైలు నుంచి విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైన సంగతి తెలిసిందే. జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, బీఆర్ గవాయి, ఏఎస్ బొప్పన్నలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపిన అనంతరం పెరారివాలన్ను విడుదల చేయాలంటూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడు రాష్ట్ర క్యాబినెట్ అంగీకరించిందని, ఇక ఆర్టికల్ 142 ప్రకారం పెరరివలన్ను విడుదల చేయడం సమంజసమే అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. తాజా తీర్పుతో నళిని శ్రీహరన్, శ్రీలంక దేశస్తుడైన ఆమె భర్త మురుగన్తో సహా ఈ కేసులో మరో ఆరుగురు దోషుల విడుదలకు ఈ తీర్పు మార్గం సుగమం చేసింది. హత్య జరిగినప్పుడు పంతొమ్మిదేళ్ల వయసులో హత్యకు సూత్రధారి అయిన ఎల్టీటీఈ వ్యక్తి శివరాసన్ కోసం పెరరివలన్ రెండు 9-వోల్ట్ బ్యాటరీలను కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. రాజీవ్ గాంధీని హత్య చేసేందుకు బాంబులో బ్యాటరీలను ఉపయోగించారు.
ఈ కేసు విషయంలో 1998లో పేరరివలన్కు కోర్టు మరణశిక్ష విధించింది. మరుసటి సంవత్సరం మరణ శిక్షణను కోర్టు సమర్థించింది. మళ్లీ 2014లో సుప్రింకోర్టు దానిని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. ఈ ఏడాది మార్చిలో ఉన్నత న్యాయస్థానం పెరరివలన్ కు బెయిల్ మంజూరు చేసింది. కొంతకాలం తర్వాత జయలలిత, ఎడప్పాడి కె. పళనిసామి నేతృత్వంలోని తమిళనాడు మంత్రివర్గం 2016, 2018లో రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులను విడుదల చేయాలని కేంద్రానికి సిఫారసు చేసినప్పటికీ కేంద్రం ఆ విజ్ఞప్తిని వ్యతిరేకించింది. వరుసగా వచ్చిన గవర్నర్లు దానిని పాటించలేదు. కొ్న్నేళ్ల తర్వాత కేబినెట్ ఆమోదాన్ని రాష్ట్రపతికి ఫార్వార్డ్ చేశారు.
Rajiv Murder Case: రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషికి బెయిల్ మంజూరు
అయితే తమిళనాడు గవర్నర్ ఈ విషయాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్కు సూచించినప్పటికీ రాష్ట్రపతి స్పందించలేదు. అయితే ఈ వ్యవహారంలో జాప్యాన్ని, గవర్నర్ చర్యను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రాజ్యాంగంలోని సెక్షన్ 161 ప్రకారం క్షమాభిక్ష ప్రసాదిస్తూ ఏడుగురు దోషులను విడుదల చేయాలన్న క్యాబినెట్ నిర్ణయానికి తమిళనాడు గవర్నర్ కట్టుబడి ఉన్నారని, అందువల్ల రాష్ట్రపతి ప్రతిస్పందన కోసం వేచి ఉండబోమని కోర్టు పేర్కొంది. రాష్ట్రపతి కార్యాలయానికి ఫైల్ చేయండని సూచించింది. గతవారం విచారణలో క్షమాపణ మంజూరు చేసే కేసులలో రాష్ట్రపతికి మాత్రమే ప్రత్యేక అధికారాలు ఉంటాయని కేంద్రం తన వాదనపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా పెరరివలన్ కు జైలు నుంచి విముక్తి కల్పిస్తూ సుప్రింకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. ఈ తీర్పుతో రాజీవ్ హత్య కేసులో జీవితఖైదు అనుభవిస్తోన్న నళిని సహా ఇతర నిందితుల విడుదలకు కూడా మార్గం సుగమమైనట్లైంది.
