RLD and BJP: యూపీలో రాజకీయ సమీకరణలు మారుతున్నట్లే కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా చేతులు కలిపిన సమాజ్వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ మధ్య విభజన రేఖ ఏర్పడినట్లే కనిపిస్తోంది. అంతే కాకుండా బీజేపీతో ఆర్ఎల్డీ చేతులు కలపబోతున్నట్లు కూడా గుసగుసలు కొనసాగుతున్నాయి. అందుకే విపక్షాల సమావేశానికి ఆర్ఎల్డీ హాజరు కాలేదని అంటున్నారు. ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో ఆ పార్టీ నేతలు సమావేశం కావడం మరింత చర్చనీయాంశమైంది.
No Confidence Motion: అవిశ్వాస తీర్మానంపై విపక్షాలకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన ప్రధాని మోదీ
అయితే ఈ ప్రచారాన్ని ఆర్ఎల్డీ అధికార ప్రతినిధి అనిల్ దూబే తోసిపుచ్చారు. ఇదంతా తప్పుడు ప్రచారమని, తమపై బురద చల్లేందుకు ఇలాంటివి చేస్తున్నారని ఆయన అన్నారు. ఇంకో చిత్రం ఏంటంటే.. ఈ ప్రచారం బీజేపీ కుట్రగా అనిల్ దూబే అభివర్ణించారు. కరువు, వరదలతో ఎదుర్కొంటున్న రైతుల సమస్యలపై ఆర్ఎల్డీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిసినట్లు ఆయన పేర్కొన్నారు. ‘‘ఆర్ఎల్డీ ప్రజాదరణ గురించి బీజేపీ ఆందోళన చెందుతోంది. అందుకే విచక్షణారహితంగా ప్రచారం చేస్తోంది. ఆర్ఎల్డీ ‘ఇండియా’ కూటమితో ఉంది. 2024 ఎన్నికల్లో ఆ కూటమితోనే కలిసి పోటీ చేస్తుంది. ముంబైలో జరగనున్న ప్రతిపక్ష పార్టీల సమావేశంలో ఆర్ఎల్డీ అధ్యక్షుడు జయంత్ చౌదరి పాల్గొంటారు’’ అని దూబే స్పష్టం చేశారు.
రాష్ట్ర అసెంబ్లీలో ఎస్పీ మిత్రపక్షమైన ఆర్ఎల్డీకి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీనికి ముందు కూడా బీజేపీతో ఆర్ఎల్డీ చేతులు కలపడంపై ఊహాగానాలు వచ్చాయి. వాటిని ఆ పార్టీ అధ్యక్షుడు జయంత్ చౌదరి ఖండించారు. ఇటీవల, ఆర్ఎల్డీ ఎమ్మెల్యేలు విధాన్ భవన్లో ముఖ్యమంత్రి యోగిని కలిశారు. ఈ సమావేశానికి సంబంధించి ఆర్ఎల్డీ ట్వీటర్ ద్వారా స్పందిస్తూ “చెరకు చెల్లింపులో జాప్యం రైతులకు పెద్ద సమస్యగా మారింది. ఆర్ఎల్డీ ఎప్పుడూ రైతు సోదరుల ప్రయోజనాల కోసం గొంతు వినిపిస్తోంది. ఈ క్రమంలో ఆర్ఎల్డీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు రాజ్పాల్ బల్యాన్ నేతృత్వంలో లెజిస్లేచర్ పార్టీ చెరుకు చెల్లింపు విషయమై ముఖ్యమంత్రితో మాట్లాడి త్వరగా చెల్లించాలని అభ్యర్థించింది’’ అని ట్వీట్ చేశారు.