రైతుల కోసం : NDA కూటమికి బై బై చెప్పిన RLP
- madhu
- Published On : December 26, 2020 / 07:14 PM IST
RLP Quits NDA : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని NDA (National Democratic Alliance) కూటమికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ కూటమి నుంచి పలు పార్టీలు బయటకు వచ్చేస్తున్నాయి. శివసేన (Shiv Sena), శిరోమి అకాలీదళ్ (Akali Dal) పార్టీలు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా..రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ (Rashtriya Loktantrik Party) ఆ జాబితాలోకి చేరిపోయింది. రాజస్థాన్ రాష్ట్రంలోని అళ్వార్ జిల్లాలో వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి RLP పార్టీ చీఫ్ హనుమాన్ బేనివాల్ (Hanuman Beniwal) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…రైతులకు వ్యతిరేకంగా పనిచేసే ఏ పార్టీకి, కూటమికి తాము మద్దతు ఇవ్వబోమని ప్రకటించడం విశేషం.
బీజేపీ నేతృత్వంలోని NDA కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు స్పష్టం చేశారాయన. కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిన కేంద్రం..వెంటనే ఆ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని లేనిపక్షంలో…ఎన్డీయే నుంచి తప్పుకుంటామని కొద్ది రోజుల క్రితమే హెచ్చరించినట్లు తెలుస్తోంది. హనుమాన్ బెనివాల్ రాజస్తాన్ నగర్లోని నాగౌర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా..దాదాపు నెల రోజులకు పైగా..ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే.
వీరికి పలు పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలియచేస్తున్నాయి. రైతులు చేస్తున్న ఆందోళన..పలువరు నేతలపై ఒత్తిడి పెరుగుతున్నట్లు సమాచారం. అయితే..చర్చలకు రావాలని కేంద్రం సూచనలను రైతు సంఘాలు స్వాగతించాయి. డిసెంబర్ 29వ తేదీ ఉదయం 11గంటలకు చర్చలకు వస్తామని ప్రకటించారు. ఎన్డీయే నుంచి ఆర్ఎల్పీ బయటకు రావడంపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
