Rouse Avenue Court : పాస్ పోర్టు జారీ విషయంలో కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీకి రౌస్ అవెన్యూ కోర్టులో ఊరట లభించింది. రాహుల్ గాంధీకి పాస్పోర్ట్ జారీపై అభ్యంతరం లేదని తెలిపింది. ఎన్ఓసీ మూడేళ్లపాటు చెల్లుబాటవుతుందని స్పష్టం చేసింది. ఎంపీగా అనర్హత వేటు, దౌత్య ప్రయాణ పత్రం సరెండర్ తరువాత సాధారణ పాస్ పోర్ట్ కోసం రాహుల్ గాంధీ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు పెండింగ్లో లేవని, పాస్ పోర్ట్ జారీ కోసం ఎన్ఓసి జారీ చేయాలని రాహుల్ గాంధీ కోరుతున్నారు.
రాహుల్ గాంధీని విదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తే నేషనల్ హెరాల్డ్ కేసు విచారణకు ఆటంకం కలుగుతుందని రాజ్యసభ మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి అంటున్నారు. సాధారణ పాస్పోర్ట్ జారీకి ఎన్ఓసీ కోరుతూ రాహుల్ గాంధీ చేసిన దరఖాస్తును వ్యతిరేకిస్తున్నారు. తాను వ్యతిరేకిస్తున్న అంశాలపై సుబ్రహ్మణ్య స్వామి కోర్టులో రిప్లై దాఖలు చేశారు. రాహుల్ గాంధీకి 10 సంవత్సరాల పాటు చెల్లుబాటు అయ్యే సాధారణ పాస్ పోర్టు ఇవ్వడానికి ఎటువంటి అర్హత లేదన్నారు.
కోర్టు తన విచక్షణాధికారాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. చట్ట పరిధిలో దరఖాస్తుదారు రాహుల్ గాంధీ పిటిషన్ పై అన్ని విషయాలను పరిశీలించి అనుమతి ఇవ్వాలని సుబ్రహ్మణ్య స్వామి కోరారు. పాస్పోర్ట్ కోసం ఎన్ఓసీ ఒక సంవత్సరం కంటే ఎక్కువ ఉండకపోవచ్చు లేదా ఏటా సమీక్షించబడాలి లేదా పాస్ పోర్ట్ జారీ సరైనదిగానే కోర్టు భావించవచ్చని సుబ్రహ్మణ్య స్వామి అఫిడవిట్ లో పేర్కొన్నారు.
అన్ని ఇతర ప్రాథమిక హక్కుల మాదిరిగానే పాస్పోర్ట్ను కలిగి ఉండే హక్కు సంపూర్ణ హక్కు కాదని పేర్కొన్నారు. జాతీయ భద్రత, పబ్లిక్ ఆర్డర్, నైతికత, నేరాల నిరోధానికి సంబంధించి ప్రభుత్వం విధించిన సహేతుకమైన పరిమితులకు లోబడి పాస్ పోర్టు జారీ ఉంటుందన్నారు. 2015లో నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేస్తూ ప్రయాణాలపై ఎలాంటి షరతులు పెట్టలేదని రాహుల్ న్యాయవాదులు కోర్టుకి తెలిపారు.
YS Viveka Case : ఎర్ర గంగిరెడ్డికి సుప్రీంకోర్టులో షాక్ .. హైకోర్టు తీర్పుపై స్టే
రాహుల్ పై ఎలాంటి క్రిమినల్ కేసులు పెండింగ్లో లేవని, విదేశాలకు వెళ్లడం ప్రాథమిక హక్కు అని రాహుల్ గాంధీ తరపు న్యాయవాదులు వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న రాహుల్ గాంధీకి పాస్పోర్ట్ జారీపై అభ్యంతరం లేదని తీర్పు ఇచ్చింది. అలాగే ఎన్ఓసీ మూడేళ్లపాటు చెల్లుబాటవుతుందని తెలిపింది.