చిక్మంగళూరు : ఆవు పేడ ఖరీదు రూ.1.25 లక్షలు..అంటే ఆశ్చర్యంగా ఉంది కదూ..కానీ ఇది అక్షర సత్యం. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే..అంత ఖరీదైన ఆవుపేడ చోరీకి గురయ్యింది. చోరీ చేసిన వ్యక్తి కూడా ఎవరో కాదు ఓ ప్రభుత్వం ఉద్యోగి. కర్ణాటకలోని చిక్ మంగళూరులో ఒక వింత చోరీ జరిగింది. ఆవు పేడ చోరీ చేసిన ఆ ప్రభుత్వ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. బిరూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ చోరీ కంప్లైంట్ ను సాక్షాత్తు పశుసంరక్షణ డిపార్ట్ మెంట్ కు చెందిన డైరెక్టర్ స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు ప్రభుత్వ ఉద్యోగి కోసం గాలింపు చేపట్టారు.
అమృత్ మహల్ కవల్కు చెందిన అమృత్ మహల్ కవల్ లోని పశుసంరక్షణ డిపార్ట్ మెంట్ ఆవరణ స్టాక్లో చేసి ఉంచిన 40 ట్రాక్టర్ ట్రక్కుల ఆవుపేడ చోరీ జరిగిందని..దాని ఖరీదు రూ. 1.25 లక్షలు ఉంటుందని డైరెక్టర్ కంప్లైంట్ లో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అదే డిపార్ట్ మెంట్ కు చెందిన సూపర్వైజర్ ఈ చోరీకి పాల్పడ్డాడని తేలింది. దీంతో అతన్ని అరెస్టు చేసి..ఆవు పేడను స్వాధీనం చేసుకుని పశుసంరక్షణ విభాగానికి తరలించారు. కాగా ఆవు పేడను వ్యవసాయ సస్యరక్షణలో వినియోగిస్తుంటారు. అలాగే ఆయుర్వేదంలోనూ ఆవు పేడకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ నేపద్యంలో ఆవు పేడకు ఎంతో డిమాండ్ పెరగటం..దాన్ని ఎక్కడ ఉన్నా స్థానికులు సేకరించి మరీ అమ్ముకుంటున్నారట. దీంతో ఆవు పేడకు దేశవ్యాప్తంగా డిమాండ్ పెరిగిన క్రమంలో సదరు ఉద్యోగి ఈ ఆవుపేడ చోరీకి పాల్పడినట్లుగా తెలిసింది.