Sabarimala Temple: శబరిమల యాత్రికులకు గుడ్ న్యూస్ అందించింది ట్రావన్కోర్ దేవస్థానం. నవంబరు 15వ తేదీ నుంచి శబరిమల ఆలయం తెరుచుకోనుంది. రెండు నెలల పాటు వర్చువల్ క్యూ విధానంలో రోజుకు 30వేల మంది భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు దేవస్థానం నిర్వాహకులు. నవంబరు 15వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రధాన అర్చకుడు కందరారు మహేశ్ సమక్షంలో మరో అర్చకుడు వీకే జయరాజ్ ఆలయ గర్భ గుడిని తెరుస్తారు.
మండల మకరవిళక్కు పండగ సీజన్ సందర్భంగా భక్తుల కోసం తెరుచుకోనుంది శబరిమల ఆలయం. శబరిమల ఆలయ దర్శనానికి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్.. లేదా RTPCR నెగిటివ్ రిపోర్ట్ కంపల్సరీ అని వెల్లడించింది బోర్డు. 16వ తేదీ నుంచి ఆలయంలోకి భక్తులకు అనుమతి ఇస్తుండగా.. డిసెంబర్ 26న శబరిమలలో మండలపూజ ముగియనుంది. డిసెంబర్ 30న మకరవిళక్కు కోసం ఆలయం తెరుచుకోనుంది.
జనవరి 14వ తేదీన మకరజ్యోతి దర్శనం తరువాత జనవరి 20న ఆలయాన్ని మూసివేయనున్నారు అధికారులు. అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చే భక్తులు కొన్ని మార్గదర్శకాలను పాటించాల్సిందేనని దేవస్థాన అధికారులు స్పష్టంచేశారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు హెల్త్ చెకప్ చేయించుకుని ఆలయానికి రావాలి. ఒరిజినల్ ఆధార్ తప్పనిసరిగా చూపించాలి. పంపాలో స్నానానికి అనుమతి ఉంటుంది. కానీ సన్నిధానంలో బస చేసేందుకు మాత్రం అనుమతులు లేవని దేవస్థానం స్పష్టం చేసింది.
పంపాలో వాహనాలకు పార్కింగ్ వసతి ఉండదు. వాహనాలకు నీలక్కల్ వరకే అనుమతిస్తారు. అక్కడి నుంచి ప్రభుత్వ బస్సులు అందుబాటులో ఉంటాయి. దర్శనం ముగించుకున్న వెంటనే ఆలయ ప్రాంగణం నుంచి వెళ్లిపోవాలి. కాలి నడకన వచ్చే భక్తులు.. స్వామి అయ్యప్పన్ రోడ్డును మాత్రమే ఉపయోగించుకోవాలి. నెయ్యాభిషేకం కోసం భక్తులు తీసుకొచ్చే నెయ్యిని సేకరించేందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయగా.. అక్కడే నెయ్యిని తిరిగి ఇస్తారని, దర్శనం తర్వాత ప్రసాదం కోసం పంపా వద్ద ఏర్పాట్లు చేశారు.