Scuffle at Congress HC: చెన్నైలోని తమిళనాడు కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కార్యకర్తల మధ్య మంగళవారం గొడవ జరిగింది. రెండు వర్గాలకు చెందిన వారు ఒకరినొకరు కుమ్ముకోవడంతో పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలకు గాయలయ్యాయి. అయితే గొడవ గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని పార్టీ కార్యకర్తలకు సర్ది చెప్పారు.
పార్టీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. తిరునల్వేలి జిల్లాలో స్థాయిలో పార్టీ కార్యకర్తల నియామకాలపై చెన్నైలోని సత్యమూర్తి భవన్(పార్టీ కార్యాలయం)లో ఇరు వర్గాల మధ్య గొడవ తలెత్తింది. తిరునల్వేలి జిల్లా అధ్యక్షుడు కేబీకే జయకుమార్ను మార్చాలని పార్టీకి చెందిన పలువురు రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. అయితే అక్కడే ఉన్న కేబీకే జయకుమార్ మద్దతుదారులతో వారికి గొడవ ఏర్పడింది.
2024 లోక్సభ ఎన్నికలకు వ్యూహాలు రచించిడంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు కేఎస్ అళగిరి హాజరయ్యారు. సమావేశం నుంచి బయటకు రాగానే అళగిరి కారును అడ్డుకునేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ సందర్భంలోనే గొడవ ఏర్పడిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ, ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.