SI Murder : నడి రోడ్డుపై ఎస్ఐని దారుణంగా నరికి చంపిన దొంగల ముఠా
పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఎస్ఐపై దాడి చేసి దారుణంగా హత్యచేశారు గుర్తు తెలియని వ్యక్తులు.. ఈ ఘటన తమిళనాడులో శనివారం అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకుంది.
- kunduru Vinod
- Published On : November 22, 2021 / 10:23 AM IST
Si Murder
SI Murder : పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఎస్ఐపై దాడి చేసి దారుణంగా హత్యచేశారు గుర్తు తెలియని వ్యక్తులు.. ఈ ఘటన తమిళనాడులో శనివారం అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరుచ్చి జిల్లా నావల్పట్టు పోలీస్ స్టేషన్లో భూమినాథన్ (56) సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా నావల్పట్టు ప్రధాన రహదారిపై ఓ ముఠా మేకలను తరలిస్తూ అనుమానాస్పదంగా కనిపించింది. ముఠాను అడ్డుకున్న ఎస్ఐ భూమినాథన్ వారి గురించి ఆరా తీశాడు.
వారు చుట్టుపక్కల ప్రాంతాల్లో మేకలు దొంగిలించే వారీగా గుర్తించాడు ఎస్ఐ.. వారిని ప్రశ్నిస్తుండగానే అక్కడి నుంచి పారిపోయారు. దీంతో తన మోటర్ సైకిల్పై వారిని వెంబడించాడు. లమావూరు రైల్వే గేట్ సమీపంలోని పల్లతుపట్టి గ్రామం వద్ద ముఠాలోని ఇద్దరినీ పట్టుకున్నాడు. ఇదే సమయంలో పారిపోయిన ముఠాసభ్యులు తిరిగి వచ్చి తమ వారిని వదిలేయాలని ఎస్ఐతో గొడవకు దిగారు. అందుకు ఎస్ఐ ఒప్పుకోకపోవడంతో తమ వద్ద ఉన్న ఆయుధాలతో ఎస్ఐని హత్యచేసి అక్కడి నుంచి పారిపోయారు.
చదవండి : Woman Police Inspector: చెన్నై వరదల్లో మహిళా ఎస్సై.. స్పృహ కోల్పోయిన వ్యక్తిని భుజాలపై మోసుకెళ్తూ..
శనివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ హత్య జరగ్గా.. ఉదయం ఐదు గంటల సమయంలో అతడిని అటుగా వెళ్తున్నవారు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని శవపరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
