విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణాల్లోని పేదలకు(ఈబీసీ) 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకొచ్చిన పాలసీపై స్టే విధించాలంటూ దాఖలైన పిటిషన్లపై శుక్రవారం(జనవరి 25,2019) సుప్రీంకోర్టు విచారణ జరిపింది. పిటిషన్లపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఈబీసీ చట్టంపై స్టే విధించేందుకు నిరాకరించింది. ఈబీసీ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ యూత్ ఫర్ క్వాలిటీ అనే సంస్థతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు సుప్రీంని ఆశ్రయించారు. అయితే ఈ చట్టంపై స్టేకు నిరాకరించిన సుప్రీం నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కేంద్రప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కోర్టు ఈ విషయాన్ని విచారిస్తుందని సీజేఐ రంజన్ గొగొయ్ తెలిపారు.