Lakhimpur Kheri Violence దేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖిమ్పూర్ ఘటనపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. లఖింపూర్ ఘటనను సుమోటోగా స్వీకరించింది అత్యున్నత న్యాయస్థానం. గురువారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్,హిమా కోహ్లీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం వాదనలు వింటుంది.
కాగా లఖిమ్పూర్ ఖేరీ జిల్లాలో ఆదివారం కేంద్రమంత్రి కుమారుడు నడిపిన కారు ఢీకొని రైతులు మరణించడం,ఆ తర్వాత చోటు చేసుకున్న ఘటనలపై సీబీఐ దర్యాప్తు చేయించాలని ఉత్తరప్రదేశ్ లాయర్లు భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)జస్టిస్ ఎన్వీ రమణని మంగళవారం ఓ లేఖ ద్వారా కోరిన విషయం తెలిసిందే. మరోవైపు, లఖిమ్పూర్
ఘటనపై దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు ఆందోళన ఉధృతం చేసిన సమయంలో దీనిపై నేరుగా సుప్రీంకోర్టు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఉత్తర్ప్రదేశ్ లఖింపుర్ ఖేరీలో ఆదివారం యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో హింస చెలరేగింది. లఖింపూర్ ఖేరీ జిల్లాలోని టికునియా గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్లను టికునియా-బన్బీర్పుర్ సరిహద్దు వద్ద అడ్డుకున్న రైతులపై రెండు కార్లు దూసుకెళ్లిన ఘటనలో, ఆతర్వాత జరిగిన ఆందోళనలో మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రాణాలు కోల్పోయినవారిలో నలుగురు రైతులు,ఓ జర్నలిస్ట్, ముగ్గురు కార్యకర్తలు,కేంద్ర సహాయక మంత్రి కారు డ్రైవర్ ఉన్నారు. అయితే రైతులపైకి దూసుకెళ్లిన ఓ కారులో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఉన్నట్లు రైతులు ఆరోపిస్తుండగా..అసలు ఆ సమయంలో తాను అక్కడ లేనని ఆశిష్ మిశ్రా చెబుతున్నారు.
ALSO READ : అమిత్ షాతో మిశ్రా భేటీ..మంత్రి పదవి సేఫ్!