సీబీఐకి వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్ లో బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో రిలీఫ్
రాష్ట్రాల పరిధిలోని కేసుల విచారణకు సీబీఐని ఎవరు పంపుతారని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
- Harishth Thanniru
- Published On : July 10, 2024 / 02:34 PM IST
Supreme Court
Supreme Court : రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా సీబీఐ నమోదు చేసిన కేసులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వేసిన పిటిషన్ ను విచారణకు సుప్రీంకోర్టు స్వీకరించింది. పశ్చిమ బెంగాల్ పిటిషన్ విచారించాల్సిదగినదే అని ధర్మాసనం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం సీబీఐను దుర్వినియోగం చేస్తుందని పిటిషన్ లో బెంగాల్ ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర పరిధిలోకివచ్చే కేసులను సైతం.. రాష్ట్ర ప్రభుత్వం అనుమతించకపోయినా సీబీఐ విచారణ చేస్తుందని పిటిషన్ లో మమత ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
Also Read : తిరుమల కొండపై ఉన్న సమస్యలేంటి.. టీటీడీపై వస్తున్న ఆరోపణలేంటి.. ప్రక్షాళన చేయాల్సినవేంటి?
రాష్ట్రాల పరిధిలోని కేసుల విచారణకు సీబీఐని ఎవరు పంపుతారని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వెస్ట్ బెంగాల్లో సీబీఐ 15కి పైగా కేసులు నమోదు చేసిందని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దీంతో రాష్ట్రంలోకి సీబీఐ ఎంట్రీపై సుప్రీంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పిటీషన్ ను కోర్టు స్వీకరించింది. 2018 నవంబర్లో సాధారణ సమ్మతిని ఉపసంహరించుకున్నప్పటికీ, సీబీఐ రాష్ట్రంలో అనధికారికంగా కేసులు నమోదు చేసిందని ఆరోపిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణకు అర్హత ఉందని సుప్రీంకోర్టు తేల్చింది. పశ్చిమ బెంగాల్ దావాపై వివరణాత్మక విచారణను మెరిట్లపై తర్వాత చేపడతామని న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం పేర్కొంది. తుది విచారణను సుప్రీంకోర్టు ఆగస్టు 13కి వాయిదా వేసింది. ఇది తీవ్రమైన సమస్య అని, సమాఖ్య నిర్మాణంలో విస్తృత పరిణామం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
Also Read : జగన్ రాజీనామా వార్తలపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి.. ప్రత్యేక హోదాపై సంచలన వ్యాఖ్యలు
బెంగాల్ ప్రభుత్వ పిటిషన్ పై మే 8న తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. 2018 నవంబర్ 16న సీబీఐ కి సమ్మతిని ఉపసంహరించుకున్న తర్వాత, సీబీఐ దర్యాప్తుకి రాష్ట్రంలోకి అనుమతి లేదని కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. అయితే, కేంద్ర ప్రభుత్వం సీబీఐ సోదాలపై ఎటువంటి పర్యవేక్షణ, నియంత్రణను కలిగి ఉండదని కేంద్రం తరఫున న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు పినిపించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ అభ్యర్ధనపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది.
