Tamil Nadu CM Vijay : కరూర్లో సీఎం విజయ్ భావోద్వేగం.. తొక్కిసలాట బాధిత కుటుంబాలకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేత
Tamil Nadu CM Vijay : గతేడాది సెప్టెంబర్ నెలలో కరూర్లో టీవీకే ర్యాలీలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 41మంది మరణించారు.
- Harish Thanniru
- Updated on- July 10, 2026 / 02:10 PM IST
Tamil Nadu CM Vijay
Tamil Nadu CM Vijay : తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెప్ విజయ్ శుక్రవారం కరూర్ జిల్లాలో పర్యటించారు. గతేడాది జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని విజయ్ హామీ ఇచ్చారు.
Also Read : Narendra Modi : ఆస్ట్రేలియా బాటలో భారత్.. సోషల్ మీడియాను బ్యాన్ చేయబోతున్నారా? ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
గతేడాది సెప్టెంబర్ నెలలో కరూర్లో టీవీకే ర్యాలీలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 41మంది మరణించారు. టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మృతుల కుటుంబాలను పరామర్శిస్తామని విజయ్ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు సీఎం బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి కరూర్లో విజయ్ పర్యటించారు. బాధిత కుటుంబాలను కలిసి.. అర్హత కలిగిన 32మందికి వివిధ ప్రభుత్వ శాఖల్లో తాత్కాలిక నియామక పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. కరూర్ తొక్కిసలాట ఘటన తన జీవితంలోనే అత్యంత బాధాకరమైనదని అన్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్థం ఒక స్మారక చిహ్నాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. బాధిత కుటుంబాల ఆర్థిక భరోసా కోసం రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన సహాయాన్ని కొనసాగిస్తుందని తెలిపారు.
ఇదిలాఉంటే.. ఈ నియామకాలను సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై తాజాగా విచారణ జరిపిన న్యాయస్థానం ఉద్యోగ పత్రాలను అందజేసేందుకు అనుమతులిచ్చింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడం చాలా పరిమితంగా ఉంటుందని కోర్టు ఈ సందర్భంగా అభిప్రాయ పడింది. అయితే, బాధితులకు ఉద్యోగాలను కల్పించేందుకు అనుమతిచ్చిన న్యాయస్థానం.. ఆ నియామకాలు కేవలం తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే ఉండాలని ఆదేశించింది. అవి న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది.
ఈ పర్యటనలో సీఎం విజయ్ కరూర్లో ఏర్పాటుకానున్న ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్కు చెందిన షూ తయారీ కర్మాగారానికి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
