Temple For Alien In Tamil Nadu
Temple For Alien In Tamil Nadu : గ్రహాంతరవాసులు నిజంగానే ఉన్నారా? అనేది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోయింది. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా రకాల వాదనలు ఉన్నాయి. గ్రహాంతర వాసులు భూమిపైకి వస్తూ పోతూ ఉంటారని కొందరి నమ్మకం. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో గ్రహాంతరవాసుల గురించి ఎక్కువ ప్రచారంలో ఉంది. తాజాగా ఓ వ్యక్తి గ్రహాంతరవాసికి గుడి కట్టాడు. అంతేకాదు.. ప్రతీరోజూ పూజలు చేస్తున్నారు. ఈ విచిత్ర ఘటన ఇతర దేశాల్లో అనుకుంటే పొరపాటే.. మన దేశంలోని తమిళనాడు రాష్ట్రంలో. సేలం జిల్లాలో ఓ వ్యక్తి గ్రహాంతర వాసికి ఆలయం కట్టి, పూజలు చేస్తున్నారు.
మల్లమూప్పన్ పట్టి సమీపంలోని రామగౌండనూర్ కు చెందిన లోగనాథన్ స్థానికంగా శివాలయాన్ని నిర్మించారు. మూలమూర్తిగా శివలింగం ప్రతిష్టించారు. అయితే, ఆ పక్కనే ఓ మండపంలో అగస్త్య మహర్షి, మరో మండపంలో గ్రహాంతరవాసి విగ్రహాలను ప్రతిష్టించారు. దేవుళ్లతోపాటు గ్రహాంతరవాసి ప్రతిమకూ లోగనాథన్ పూజలు చేస్తున్నాడు. 11 అడుగుల లోతైన నేలమాళిగలో ఈ గుడిని నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం 2021 నుండి కొనసాగుతోంది. ఆలయంలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నందున పరిమిత స్థాయిలోనే పూజలు జరుగుతున్నాయని, కొద్దిరోజుల తరువాత అన్నిరకాల పూజలు జరుగుతాయని తెలిపారు.
Also Read : నన్ను సజీవంగా పూడ్చిపెట్టారు.. వీధి కుక్కలు మట్టిని తొవ్వి ప్రాణాలు కాపాడాయి: ఆగ్రా యువకుడు
ఈ గుడిని నిర్మించిన లోగనాథన్ మాట్లాడుతూ.. నేను గ్రహాంతర దేవతలతో మాట్లాడిన, వారినుంచి ఆలయాన్ని నిర్మించడానికి అనుమతి పొందానని చెప్పాడు. ప్రపంచంలో ప్రకృతి వైపరిత్యాలు పెరిగిపోతుండటంతో వాటిని అడ్డుకునే శక్తి గ్రహాంతరవాసులకు ఉందని తాను నమ్ముతున్నానని అన్నాడు. అంతేకాదు.. శివుడు ప్రపంచాన్ని సృష్టించిన తరువాత గ్రహాంతరవాసులు పుట్టారు. ఈ విషయాన్ని అగస్త్య మహర్షి గ్రంథాలలో రాశారు. అందుకే విగ్రహాలు ప్రతిష్టించి పూజిస్తున్నానని లోగోనాథన్ చెప్పారు. గ్రహాంతరవాసి ఆలయాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.