Bengaluru: మా తాతయ్యను మంత్రి వర్గంలోకి తీసుకోండి.. రాహుల్ గాంధీకి ఏడేళ్ల చిన్నారి లేఖ
కర్ణాటక ప్రభుత్వంలో తన తాతయ్యకు మంత్రి పదవి ఇవ్వకపోవటంతో తాను చాలా డిస్టర్బ్ అయ్యాను. మా తాతయ్యను కేబినెట్లోకి తీసుకోవాలని కోరుతూ ఏడేళ్ల చిన్నారి రాహుల్ గాంధీకి లేఖ రాసింది.
- Harishth Thanniru
- Published On : May 29, 2023 / 10:58 AM IST
Jayachandra Granddaughter letter
Rahul Gandhi: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లు మే20న ప్రమాణ స్వీకారం చేశారు. వీరితోపాటు మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండు రోజుల క్రితం సిద్ధరామయ్య కేబినెట్ విస్తరణ జరిగింది. మరో 24మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ఈ మంత్రివర్గ విస్తరణలో తన తాతయ్యకు మంత్రి పదవి రాలేదని ఓ ఏడేళ్ల చిన్నారి చాలా బాధపడిదంట. అంతటితో ఆగని ఆ చిన్నారి.. తన తాతయ్యకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదని ఏకంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాసింది. ప్రస్తుతం ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Rahul Gandhi: కొత్త పాస్పోర్ట్ తీసుకున్న రాహుల్ గాంధీ.. నేడు అమెరికాకు ప్రయాణం
కర్ణాటక ప్రభుత్వంలో తన తాతయ్యకు మంత్రి పదవి ఇవ్వకపోవటంతో తాను చాలా డిస్టర్బ్ అయ్యాను. మా తాతయ్య చాలా సమర్ధుడు, కష్టపడే వ్యక్తి. ఆయనకు కేబినెట్లో స్థానం కల్పించాలని ఆ చిన్నారి రాహుల్ గాంధీని లేఖలో కోరింది. ఈ ఏడేళ్ల చిన్నారి పేరు ఆర్నా సందీప్. ఆమె కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే టీవీ జయచంద్ర మనవరాలు. రెండో కుమారుడు కుమార్తె. ఆర్నా మూడవ తరగతి చదువుతుంది.మంత్రి వర్గ విస్తరణరోజు తన తాతయ్యకు మంత్రి పదవి వస్తుందని ఆ చిన్నారి టీవీ ముందే కూర్చుంది. అయితే, తన తాతయ్యకు మంత్రి పదవి ఇవ్వలేదని తెలియగానే ఏడ్వటం మొదలు పెట్టింది. దీంతో కుటుంబ సభ్యులు ఆ చిన్నారిని ఓదార్చారు. అయినా ఏడ్వటం ఆపలేదు. ఆ చిన్నారి ఏడ్వటం ఆపేందుకు రాహుల్ గాంధీకి లేఖ రాయమని చెప్పారు. దానిని ఆర్నా సీరియస్గా తీసుకుందని ఆమె తండ్రి సందీప్ తెలిపాడు.
ఇదిలాఉంటే కుంచిటిగ సామాజిక వర్గానికి మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం కల్పించక పోవటంతో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ టీబీ జయచంద్ర మద్దతుదారులు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇంటి బయట బైఠాయించారు. ఆ తరువాత జయచంద్ర పార్టీ హైకమాండ్ ను కలిసి న్యాయం చేయాలని కోరారు.
