PubG Madness: స్నేహితుడితో పబ్జీ ఆడడం కోసం ట్రైన్ ను ఆపేసిన 12 ఏళ్ల బాలుడు
తన స్నేహితుడితో కలిసి పబ్జీ వీడియో గేమ్ ఆడేందుకు ఓ 12 ఏళ్ల బాలుడు ఏకంగా రైళ్లనే ఆపేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది
- Bharath Reddy
- Published On : April 4, 2022 / 06:45 AM IST
Pubg
PubG Madness: చిన్నారుల్లో వీడియో గేమ్స్ ఎంతటి ప్రతికూల ప్రభావం చూపుతాయో తెలిపే ఘటన ఇది. తన స్నేహితుడితో కలిసి పబ్జీ వీడియో గేమ్ ఆడేందుకు ఓ 12 ఏళ్ల బాలుడు ఏకంగా రైళ్లనే ఆపేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 30న బెంగళూరులోని యెలహంక రైల్వేస్టేషన్ లో చోటుచేసుకున్న ఈఘటన తాలూకు వివరాలు ఇలా ఉన్నాయి. మార్చి 30 మధ్యాహ్నం సమయంలో యెలహంక రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరాల్సిన కాచిగూడ ఎక్స్ప్రెస్ ట్రైన్లో బాంబు పెట్టమంటూ రైల్వే కేంద్రానికి సమాచారం వచ్చింది. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న బాంబు స్క్వాడ్, ఫైర్ డిపార్ట్మెంట్, ఇతర భద్రతా సిబ్బంది..స్టేషన్లో ఉన్న ప్రయాణికులను బయటకు పంపి, స్టేషన్ మొత్తాన్ని జాగిలాలతో జల్లెడ పట్టారు. అయితే ఎక్కడా బాంబు జాడ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు..ఎవరైనా ఆకతాయి ఇలా తప్పుడు సమాచారం ఇచ్చి ఉండొచ్చని భావించారు.
Also read:Puri Temple Kitchen: పూరీ జగన్నాథుడి క్షేత్ర పాకశాలలో మట్టి పొయ్యిలు ధ్వంసం: విచారణకు ఆదేశం
అనంతరం రైల్వేశాఖ ఉన్నతాధికారులు..ఘటనపై విచారణకు ఆదేశించారు. బాంబు బెదిరింపు సమాచారం ఇచ్చిన ఫోన్ నెంబర్ ను ట్రేస్ చేసిన అధికారులు..తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తిని ప్రశ్నించేందుకు వెళ్లారు. అయితే అక్కడికి వెళ్లిన అధికారులకు అసలు విషయం తెలిసి విస్తుపోయారు. బాంబు బెదిరింపుకు పాల్పడింది ఓ 12 ఏళ్ల బాలుడిగా గుర్తించిన అధికారులు..బాలుడు ఇచ్చిన సమాచారం విని ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్జీ వీడియో గేమ్ కు బానిసైన ఆ బాలుడు తన మిత్రుడితో కలిసి మార్చి 30న గేమ్ ఆడుతున్నాడు. ఇంతలో అవతలి వైపునున్న మిత్రుడు ట్రైన్లో మరో ఊరు వెళ్లాల్సి ఉంది. అయితే గేమ్ మధ్యలో ఉండగా మిత్రుడు వదిలి వెళ్లడం ఇష్టంలేని ఆ బాలుడు ఇలా స్టేషన్ కు ఫోన్ చేసి బాంబు బెదిరింపుకు పాలపడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసిన రైల్వే అధికారులు..బాలుడి తలిదండ్రులను మందలించారు.
Also read:Air Ambulances: దేశం మొత్తం మీద కేవలం 49 ఎయిర్ అంబులెన్సులే ఉన్నాయి: కేంద్రం
