రాఫెల్ విమానాల కొనుగోలు ఒప్పందం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది.
ఢిల్లీ : రాఫెల్ విమానాల కొనుగోలు ఒప్పందం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. రాఫెల్ విమానాల కొనుగోలు ఒప్పందంపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం రివ్యూ పిటిషన్లను విచారణకు స్వీకరిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఎప్పుడు విచారణ చేపట్టేది త్వరలోనే చెబుతామంది.
Read Also : 11న సెలవు ప్రకటించని సంస్థలపై చర్యలు : దాన కిషోర్
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. 2018 డిసెంబర్లో ఇచ్చిన ఆదేశాలను సమీక్షించాలని కోరుతూ యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఈ పిటిషన్లు దాఖలు చేశారు. వీరి పిటిషన్లపై అభ్యంతరం వ్యక్తం చేసిన కేంద్రం.. విచారణకు స్వీకరించొద్దని సుప్రీంకోర్టుని కోరింది. 1923 భారత సాక్ష్యాధారాల చట్టంలోని సెక్షన్ 123 ప్రకారం పిటిషనర్లు సమర్పించిన పత్రాలను పరిగణనలోకి తీసుకోరాదని కేంద్రం వాదించింది.
అధికార రహస్యాల చట్టం పరిధిలో గల పత్రాలను సంబంధిత శాఖ అనుమతి లేకుండా ఎవరూ న్యాయస్థానంలో ప్రవేశపెట్టలేరని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపించారు. దీనిపై మార్చి 14న విచారించిన కోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ (ఏప్రిల్ 10) తీర్పు ఇచ్చింది. రివ్యూ పిటిషన్లపై విచారణ చేస్తామని కోర్టు వెల్లడించింది.
Read Also : సమంత పిలుపు : ఆ టీడీపీ అభ్యర్థిని గెలిపించండి