Delhi Bomb Threat: స్వాతంత్ర్య దినోత్సవ వేళ తీవ్ర ఉద్రిక్తత.. ఢిల్లీలో బాంబు హెచ్చరికలు.. రంగంలోకి భద్రతా దళాలు
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ సర్వసిద్ధమవుతున్న వేళ బాంబు(Delhi Bomb Threat) బెదిరింపులు తీవ్ర ఆందోళన రేకెత్తించాయి.
Security alert in delhi after bomb threat emails to key locations
- ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
- హైకోర్టు, ఎయిర్పోర్ట్లో విస్తృత తనిఖీలు
- నకిలీ మెయిల్గా తేల్చిన పోలీసులు
Delhi Bomb Threat: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ సర్వసిద్ధమవుతున్న వేళ బాంబు బెదిరింపులు తీవ్ర ఆందోళన రేకెత్తించాయి. వేడుకలకు సరిగ్గా ఒక్కరోజు ముందు ఢిల్లీ హైకోర్టు, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టర్మినల్-3తో పాటు సాకేత్, జండేవాలాన్, జామ్నగర్ హౌస్, ఢిల్లీ కంటోన్మెంట్ ఎస్డీఎమ్ కార్యాలయాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు ఆయా ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టాయి.
ఇ-మెయిల్ ద్వారా బెదిరింపు, రంగంలోకి భద్రతా దళాలు:
ఢిల్లీ హైకోర్టుకు ఇ-మెయిల్ ద్వారా ఈ బెదిరింపు రాగా, మధ్యాహ్నం 2:11 గంటలకు పేలుడు జరుగుతుందని పేర్కొన్నారు. సమాచారం అందుకున్న వెంటనే బాంబు నిరోధక బృందాలు, స్నిఫర్ డాగ్ స్క్వాడ్లు ప్రాంగణాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. విమానాశ్రయం, ఇతర సున్నితమైన ప్రాంతాల్లో కూడా ఫైర్ సిబ్బంది, పోలీసులు అణువణువూ గాలించారు. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ నిరంతరం పోలీసులతో సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని సమీక్షించారు.
తేలిన నకిలీ బెదిరింపులు, యథాతథంగా విధులు:
ఈ విస్తృత సోదాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేదా పేలుడు(Delhi Bomb Threat) పదార్థాలు లభించలేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఇవన్నీ కేవలం నకిలీ (హోక్స్) బెదిరింపులుగానే ప్రాథమికంగా నిర్ధారించారు. భయాందోళనలు వ్యక్తమైనప్పటికీ కోర్టు కార్యకలాపాలు యథాతథంగా సాగాయి. ప్రస్తుతం రాజధానిలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్, పోలీసులు వెల్లడించారు.
