Ukraine Crisis : యుక్రెయిన్లో పరిస్థితులపై కేంద్రం అలర్ట్ అయింది. కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక
మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొనున్నారు. వీరితో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజీత్ దోవల్ కూడా పాల్గొనున్నారు. ప్రస్తుత యుక్రెయిన్లో తాజా పరిస్థితులపై ప్రధానమంత్రి మోదీకి విదేశాంగ శాఖ వివరించనుంది. మరోవైపు శుక్రవారం
(ఫిబ్రవరి 25)న నాటో దేశాల అధినేతలు సమావేశం కానున్నారు.
యుక్రెయిన్ పై రష్యాదాడులను నాటో తీవ్రంగా ఖండించింది. యుక్రెయిన్ను కాపాడేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామని నాటో స్పష్టం చేసింది. యుక్రెయిన్ ప్రజలు, ప్రభుత్వానికి అండగా ఉంటామని నాటో సెక్రటరీ జనరల్ తెలిపారు. యుక్రెయిన్ పై రష్యా వెంటనే దాడులు ఆపేయాలని నాటో హెచ్చరించింది. ఇదిలా ఉండగా… యుక్రెయిన్లోని అన్ని నగరాలపై రష్యా దాడులు చేస్తోంది. రష్యా దాడిలో 40 మంది యుక్రెయిన్ సైనికులు మృతిచెందారు. పదిమందికి పైగా సామన్య పౌరులు మృతిచెందినట్టు ప్రకటించారు.
రెండు ఎయిర్ ఫోర్టులను రష్యా సైన్యం ధ్వంసం చేసింది. రష్యా దాడులను యుక్రెయిన్ సైనిక దళం కూడా తిప్పికొడుతోంది. మరో రష్యా యుద్ధ విమానాన్ని కూల్చేసినట్టు యుక్రెయిన్ వెల్లడించింది. మొత్తం 7 రష్యా యుద్ధ విమానాలను కూల్చివేసినట్టు ప్రకటించింది. 50 మంది రష్యా సైనికులను హతమార్చినట్టు యుక్రెయిన్ ప్రకటించింది. రష్యాతో పూర్తిగా దౌత్య సంబంధాలను తెంచుకున్నట్టుగా యుక్రెయిన్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
Read Also : Russia Ukraine War : రష్యాతో దౌత్య సంబంధాలు తెంచుకున్న యుక్రెయిన్