Russia Ukraine War : రష్యాతో దౌత్య సంబంధాలు తెంచుకున్న యుక్రెయిన్
తమ దేశంపై రష్యా దాడి నేపథ్యంలో యుక్రెయిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమపై దాడికి తెగబడ్డ రష్యాతో ఇకపై దౌత్య సంబంధాలను నెరపేదిలేదని యుక్రెయిన్ తేల్చేసింది.
Russia Ukraine War : తమ దేశంపై రష్యా దాడి నేపథ్యంలో యుక్రెయిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమపై దాడికి తెగబడ్డ రష్యాతో ఇకపై దౌత్య సంబంధాలను నెరపేదిలేదని యుక్రెయిన్ తేల్చేసింది. ఈ మేరకు రష్యాతో దౌత్య సంబంధాలను తెంచుకుంటున్నట్లు యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ ప్రకటించారు. యుద్ధాన్ని నివారించేందుకు యుక్రెయిన్ మిత్రదేశాలు రష్యాపై కఠినమైన ఆంక్షలు విధించడానికి వెనకాడొద్దని కోరారు. అటు యుక్రెయిన్ పై రష్యా దాడితో పోలాండ్, జర్మనీ అప్రమత్తం అయ్యాయి. యుక్రెయిన్ కు సరిహద్దున ఉన్న పోలాండ్ పై దాడి చేస్తే పెద్దఎత్తున పోలాండ్ కు సైనిక సహకారం అందిస్తామని జర్మనీ ప్రకటించింది.
రష్యా, ఉక్రెయిన్ల మధ్య నెలకొన్న యుద్ధం ప్రపంచ దేశాలను భయకంపితులను చేస్తోంది. మిలిటరీ ఆపరేషన్ పేరుతో యుక్రెయిన్పై రష్యా విరుచుకుపడుతోంది. బాంబుల వర్షం కురిపిస్తోంది. అయితే రష్యా చేస్తున్నది మిలిటరీ ఆపరేషన్ కాదని, యుద్ధానికే తెగబడుతోందని యుక్రెయిన్ వాదిస్తోంది. ఇప్పటికే యుక్రెయిన్పై రష్యా బాంబుల వర్షాన్ని కురిపించింది. తానేమీ తక్కువ తినలేదన్నట్లుగా రష్యా ఫైటర్ జెట్లను కూల్చేశామని యుక్రెయిన్ ప్రకటించింది. ఇరు దేశాల మధ్య పోరు అంతకంతకూ భీకర రూపం దాలుస్తోంది.
గురువారం(ఫిబ్రవరి 24) ఉదయం నుంచి మిలిటరీ ఆపరేషన్ అంటూ దాడులకు దిగిన రష్యా యుక్రెయిన్ను చుట్టేస్తోంది. యుక్రెయిన్పై మూడు దిక్కుల నుంచి రష్యా మెరుపు దాడులకు దిగింది. తూర్పు, ఉత్తర, దక్షిణ దిక్కుల నుంచి యుక్రెయిన్పై రష్యా విరుచుకుపడుతోంది. దీంతో యుక్రెయిన్ వాసులతో పాటు ఆ దేశంలో ఉంటున్న ఇతర దేశస్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రష్యా దాడులు లేని నాలుగో దిక్కైన పడమర వైపుగా పరుగులు పెడుతున్నారు.
యుక్రెయిన్ తో యుద్ధం వేళ.. రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేశారు. యుక్రెయిన్ దేశం, ఆ దేశ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసే ఉద్దేశం ప్రస్తుతం తాము చేపట్టిన చర్యలకు లేదన్నారు. యుక్రెయిన్ ఆవాసం చేసుకుని రష్యాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్న వారి నుంచి రష్యాను రక్షించేందుకు.. యుక్రెయిన్ లోని రష్యా మద్దతుదారులు అండగా ఉంటారని చెప్పారు.
యుక్రెయిన్ పై రష్యా దాడి నేపథ్యంలో రాజధాని కీవ్ లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఎటుపక్క నుంచి ఏ క్షిపణి వచ్చి పడుతుందో.. ఏ బాంబు వచ్చి పేలుతుందో తెలియని దిక్కు తోచని పరిస్థితుల్లో ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు.
తట్టాబుట్ట సర్దుకుని పిల్లలు, పెంపుడు జంతువులను చంకనెత్తుకుని ప్రాణాలు అరచేత పట్టుకుని కీవ్ ను విడిచిపెట్టి వెళ్లిపోతున్నారు. మరికొందరు బాంబులు, క్షిపణుల దాడి నుంచి తప్పించుకునేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బంకర్లలోకి వెళ్తున్నారు. కీవ్ లోని వీధులు, మెట్రో స్టేషన్లన్నీ జనంతో నిండిపోయాయి. వీధులన్నీ భావోద్వేగ భరితంగా మారాయి. కొందరు తలదాచుకోవడానికి మెట్రో అండర్ గ్రౌండ్ స్టేషన్లకు వెళితే.. మరికొందరు ఏ రైలు దొరికితే ఆ రైలు ఎక్కేసి సిటీని దాటెళ్లిపోయారు. మరికొందరు బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణించారు.
లోపల ఎన్ని భయాలున్నా ఏం కాదంటూ పిల్లలకు ధైర్యం నూరిపోస్తూ కనిపించిన తల్లుల దృశ్యాలు కలచివేస్తున్నాయి. వీధుల్లో జనాలు ప్రార్థనలు చేస్తూ కనిపించారు. ఇక, నగరాన్ని విడిచివెళ్లిపోతున్న వారి కార్లతో సిటీ రహదారులన్నీ నిండిపోయాయి. ఎటు చూసినా కిలోమీటర్లకొద్దీ కార్ల ట్రాఫిక్ కనిపించింది. కీవ్ నుంచి సిటీ పశ్చిమ ప్రాంతానికి చాలా మంది తరలివెళ్లిపోతున్నారు.