Narayan Rane Controversial comments : కేంద్రమంత్రి నారాయణ్ రాణె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేను లాగిపెట్టి కొట్టాలనుకున్నాను.. అని అనడం తీవ్ర కలకలం రేపుతోంది. రాయ్గఢ్ జిల్లాలో నిన్న మంత్రి నారాయణ్ రాణె జన్ ఆశీర్వాద్ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం ఏ ఏడాదిలో వచ్చిందో తెలియని ఉద్ధవ్ థాక్రేను తాను కొడదామనుకున్నా అని అన్నారు.
స్వాతంత్ర్యం ఏ ఏడాది వచ్చిందో ముఖ్యమంత్రికి తెలియకపోవడం సిగ్గు చేటన్నారు. ఆయన ప్రసంగం సందర్భంగా ఇది ఎన్నో స్వాతంత్ర్య దినోత్సవమో కనుక్కొని మరీ చెప్పారు. ఒకవేళ తాను అక్కడే ఉండి ఉంటే.. ఆయనను గట్టిగా కొట్టేవాడిని అని నారాయణ్ రాణె అన్నారు.
మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలపై శివసేన తీవ్రంగా మండిపడింది. సోమవారం రాత్రే ఆయనపై నాసిక్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాసిక్ పోలీసులు రాణెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం రాణె కొంకణ్ ప్రాంతంలోని చిప్లున్లో ఉండటంతో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు అక్కడి వెళ్లారు.
ఈ వివాదంపై నాసిక్ పోలీస్ కమిషనర్ దీపక్ పాండే మాట్లాడుతూ ఇది చాలా తీవ్రమైన అంశమన్నారు. కేంద్రమంత్రిపై చర్యలు తీసుకోవడానికి ఇప్పటికే ఓ బృందం వెళ్లిందన్నారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ కోర్టులో హాజరు పరుస్తామని చెప్పారు. కోర్టు నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్తామని అన్నారు.
కేంద్ర మంత్రి నారాయణ్ రాణె వివాదాస్పద వ్యాఖ్యలుకేంద్ర మంత్రి వ్యాఖ్యలతో బీజేపీ, శివసేన మధ్య మళ్లీ యుద్ధం మొదలైంది. నాసిక్లో శివసేన కార్యకర్తలు బీజేపీ ఆఫీస్పై రాళ్ల దాడి చేయగా.. ముంబైలో రెండు పార్టీల వాళ్లు బాహాబాహీకి దిగారు.