Own Surgery : ఉత్తరప్రదేశ్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న ఓ వ్యక్తి చేసిన పని అందరినీ షాక్ కి గురి చేసింది. అతడి ప్రాణాల మీదకు తెచ్చింది. భరించలేని కడుపు నొప్పితో బాధపడుతున్న అతడు.. తనకు తానే సర్జరీ చేసుకోవాలని అనుకున్నాడు. యూట్యూబ్ వీడియోలు చూస్తూ సొంతంగా ఆపరేషన్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అయితే, అది కాస్తా బెడిసి కొట్టింది. ప్రాణాల మీదకు తెచ్చింది.
అతడి పేరు రాజాబాబు. వయసు 32 సంవత్సరాలు. సున్ రాక్ గ్రామంలో నివాసం ఉంటున్నాడు. రాజాబాబు కొంత కాలంగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. చాలా మంది డాక్టర్ల దగ్గరికి వెళ్లి చూపించుకున్నాడు. కానీ, అతడి కడుపు నొప్పి మాత్రం తగ్గలేదు. ఏ డాక్టర్ కూడా అతడికి నయం చేయలేకపోయాడు.
దీంతో రాజాబాబు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తనకు తానే కడుపు కోసుకుని ఆపరేషన్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. సర్జరీ ఎలా చేయాలో యూట్యూబ్ లో వీడియోలు చూశాడు. మథురకు వెళ్లి ఆపరేషన్ కు అవసరమయ్యే సర్జికల్ బ్లేడ్ లు, కుట్లు వేసుకునే నీడిల్స్, మత్తు ఇంజెక్షన్లు తెచ్చుకున్నాడు.
Also Read : జడ్జి ఇంట్లో నోట్ల కట్టల కలకలం, దేశవ్యాప్తంగా రేగిన దుమారం.. ఎవరీ యశ్వంత్ వర్మ?
ఆపరేషన్ కు అవసరమైన అన్ని పరికరాలు తెచ్చుకున్న రాజాబాబు తన ఇంట్లోనే ఒక గదిలో సర్జరీకి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆపరేషన్ కు ముందు తనకు తానుగా మత్తు ఇంజెక్షన్ ఇచ్చుకున్నాడు. తర్వాత కడుపు కుడివైపున 7 అంగుళాల గాటు పెట్టుకున్నాడు. అయితే, అతడు అనుకున్నదొక్కటి అక్కడ జరిగింది మరొకటి. అనుకున్న దానికంటే ఎక్కువ గాటు పడి తీవ్ర రక్తస్రావమైంది. దీంతో రాజాబాబు భయపడిపోయాడు. సూది, దారంతో కుట్లు వేసుకునేందుకు ప్రయత్నించాడు.
ఇంతలోనే మత్తు ఇంజక్షన్ ప్రభావం తగ్గి నొప్పి తీవ్రత పెరిగింది. అటు రక్తస్రావం కూడా ఆగలేదు. కంగారుపడ్డ రాజాబాబు వెంటనే కుటుంబ సభ్యులకు విషయం చెప్పేశాడు. వెంటనే కుటుంబసభ్యులు రాజాబాబును ఆసుపత్రికి తరలించారు. అక్కడ రాజాబాబుకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. కాగా, రాజాబాబు కొన్ని సంవత్సరాలుగా అపెండిక్స్ తో బాధపడుతున్నాడు. 14 ఏళ్ల వయసులోనే అతడికి సర్జరీ జరిగింది.
డాక్టర్లు తన కడుపు నొప్పిని తగ్గించలేకపోయారని.. తానే స్వయంగా కడుపు ఆపరేషన్ చేసుకోవాలని రాజాబాబు చేసిన ప్రయత్నం తెలిసి కుటుంబసభ్యులు, డాక్టర్లు, స్థానికులు షాక్ కి గురయ్యారు. వీడెవడండీ బాబూ అని తల పట్టుకున్నారు. పొరపాటున కూడా ఎవరూ ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని డాక్టర్లు సూచించారు. ఇలాంటివి ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరించారు.