Opendoor Company: భారత్ ఉద్యోగులకు భారీ షాక్.. ఇండియా ఆఫీస్కు గుడ్బై చెప్పనున్న అమెరికా కంపెనీ
అమెరికాకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ టెక్నాలజీ సంస్థ ఓపెన్డోర్(Opendoor Company) టెక్నాలజీస్ భారత్లోని తన కార్యకలాపాలను క్రమంగా మూసివేయాలని నిర్ణయించడం చర్చనీయాంశంగా మారింది.
- V Santhosh Kumar
- Published on- June 11, 2026 / 07:16 PM IST
Us real estate tech company opendoor shuts india operations affecting hundreds of jobs
- భారత్ కార్యకలాపాలకు కంపెనీ గుడ్బై
- 250 మంది ఉద్యోగులపై ప్రభావం
- ఏఐతో ఉద్యోగాల అవసరం తగ్గింపు
Opendoor Company: ప్రపంచవ్యాప్తంగా సంస్థలు ఖర్చులు తగ్గించుకోవడం, కృత్రిమ మేధ ఆధారిత వ్యవస్థలను పెంచడం, కార్యకలాపాలను వినియోగదారులకు దగ్గరగా తీసుకెళ్లడం వంటి వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ టెక్నాలజీ సంస్థ ఓపెన్డోర్ టెక్నాలజీస్ భారత్లోని తన కార్యకలాపాలను క్రమంగా మూసివేయాలని నిర్ణయించడం చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయంతో భారతదేశంలో పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులపై ప్రభావం పడనుంది.
సంస్థ సీఈవో కాజ్ నెజాటియన్ ఉద్యోగులకు పంపిన సందేశంలో భారత్లోని కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. కంపెనీ ‘ఓపెన్డోర్ 2.0’ ప్రారంభించిన సమయంలో భారత్లో దాదాపు 250 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. గత కొన్ని నెలలుగా కొన్ని కీలక బాధ్యతలను అమెరికాకు తరలించిన సంస్థ, ఇప్పుడు మిగిలిన ఆపరేషనల్ పోస్టులను కూడా వినియోగదారులకు దగ్గరగా ఉండేలా అమెరికాకు మార్చే ప్రక్రియను పూర్తి చేస్తోంది. అయితే ఈ నిర్ణయం భారత ఉద్యోగుల పనితీరుతో సంబంధం లేదని, వారు సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని సీఈవో స్పష్టం చేశారు.
ఉద్యోగాలను తగ్గించడానికి ప్రధాన కారణంగా సంస్థ తన కార్యకలాపాల్లో భారీ మార్పులు చేపట్టడాన్ని పేర్కొంది. గతంలో విభిన్న వ్యవస్థలు, మాన్యువల్ వర్క్ఫ్లోలను నిర్వహించడానికి పెద్ద ఎత్తున సిబ్బంది అవసరమయ్యేదని, ప్రస్తుతం AI ఆధారిత సాంకేతికతను వినియోగించి అనేక ప్రక్రియలను సరళీకృతం చేసినట్లు వెల్లడించింది. దీంతో తక్కువ మంది సిబ్బందితోనే ఎక్కువ ప్రభావవంతంగా పనిచేయగలమనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది. ప్రభావిత ఉద్యోగులకు సెవరెన్స్ ప్యాకేజీలు, కొత్త ఉద్యోగాల కోసం సహాయక సేవలు, ఇతర మద్దతు కార్యక్రమాలు అందించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. AI ప్రభావంతో ఉద్యోగాల స్వరూపం ఎలా మారుతోందో ఈ నిర్ణయం మరోసారి స్పష్టం చేస్తోందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
