Vaccine Maitri : వ్యాక్సిన్ మైత్రీతో భారత్ ప్రభ ప్రపంచ వ్యాప్తంగా వెలిగిపోతుంది. అమెరికా, రష్యా, బ్రిటన్ల తర్వాత వ్యాక్సిన్ తయారు చేసిన నాలుగో దేశంగా గుర్తింపు పొందడమే కాకుండా ఇతర దేశాలకు ఫ్రీగా వ్యాక్సిన్లు అందిస్తుండటంతో.. ప్రపంచ వ్యాప్తంగా భారత్కు ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ , WHO చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గేబ్రియేసస్ భారత్పై ప్రశంసల వర్షం కురిపించారు.
కరోనాకు వ్యతిరేకంగా చేస్తున్న యుద్ధంలో నరేంద్ర మోదీ సర్కారు వ్యవహరిస్తున్న తీరును కొనియాడారు. కరోనా నివారణలో ప్రపంచ దేశాలకు తోడ్పాటు అందిస్తున్నందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఇండియా, WHO కలిసి పనిచేస్తే కోవిడ్ను కట్టడి చేయవచ్చని టెడ్రోస్ పేర్కొన్నారు. వ్యాక్సిన్లు అందివ్వడం ద్వారా ఎన్నో ప్రాణాలను, ఎంతో మంది జీవనోపాధిని కాపాడవచ్చని, తమతో కలిసి పని చేయాలంటూ ట్విట్టర్లో విజ్ఞప్తి చేశారు టెడ్రోస్.
వ్యాక్సిన్ మైత్రీ పేరుతో పొరుగు దేశాలకు ఫ్రీగా వ్యాక్సిన్లు సరఫరా చేస్తోంది భారత ప్రభుత్వం. అందులో భాగంగా భూటాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, సీషెల్స్ దేశాలకు వ్యాక్సిన్లు అందించారు. అదే విధంగా మొరాకో, బ్రెజిల్లకు ఇండియా నుంచే వ్యాక్సిన్లు సరఫరా అవుతున్నాయి. ఇప్పటికే బ్రెజిల్ ప్రధాని బొల్సనారో భారత్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు నిజమైన స్నేహానికి అర్థం ఇండియా అంటూ అమెరికా సౌత్ సెంట్రల్ ఏసియా విభాగం ట్వీట్ చేసింది.
భారత్కు చెందిన సీరమ్ ఇన్సిస్టిట్యూట్ రూపొందించిన కోవీషీల్డ్ వ్యాక్సిన్కు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. చవకగా ఉండటంతో పాటు తేలికగా నిల్వ చేసుకునే వెసులుబాటు ఉండటంతో వరుసగా ఒక్కో దేశం కోవీషీల్డ్ వ్యాక్సిన్ వైపు మొగ్గు చూపుతోంది. తాజాగా కరోనా టీకాకు దక్షిణాఫ్రికా అనుమతి ఇచ్చింది. సరఫరా చేసేందుకు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను దక్షిణాఫ్రికా ప్రభుత్వం కోరింది.
ఈ మేరకు దక్షిణాఫ్రికా ఆరోగ్య శాఖ మంత్రి ఈ మేరకు పార్లమెంటులో కీలక ప్రకటన చేశారు. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనెకా, సీరం సంస్థలు సంయుక్తంగా కొవిషీల్డ్ టీకాను ఉత్పత్తి చేస్తున్నాయి. జనవరి నెలాఖరుకు వరకు 10 లక్షల కోవీషీల్డ్ టీకాలు కావాలని దక్షిణాఫ్రికా కోరింది. ఫిబ్రవరిలో మరో 5 లక్షల డోసులను సరఫరా చేయాలంది. సీరమ్ సంస్థ నుంచి టీకా స్టాక్ వస్తుండటంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించేందుకు దక్షిణాఫ్రికా చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది.
ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో కొత్త స్ట్రెయిన్ కారణంగా రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ప్రస్తుతం అందుబాటులో వచ్చిన కోవీషీల్డ్ టీకాలు కొత్త స్ట్రెయిన్ కూడా అడ్డుకోగలవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో ఆ దేశం వ్యాక్సినేషన్ చేసేందుకు సిద్ధమైంది.