Vande Bharat Express: వందే భారత్ ఎక్స్ప్రెస్పై మరోసారి రాళ్లదాడి.. ఈసారి ఏ రాష్ట్రంలో అంటే..
వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుపై రాళ్లదాడి జరిగింది. రైలు అద్దాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఇలాంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.
- Harishth Thanniru
- Published On : June 19, 2023 / 09:51 AM IST
Vande Bharat Express
Vande Bharat Stone Attack: ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) పై రాళ్ల దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు రైలుపై రాళ్లు విసిరారు. ఈ ఘటన ఆదివారం రాత్రి ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని ముజఫర్నగర్ స్టేషన్ (Muzaffarnagar Station) సమీపంలో చోటు చేసుకుంది. కోచ్ ఈ-1 సీటు నెంబర్ 13-14 ప్రాంతంలో దాడి జరిగినట్లు ప్రయాణికులు తెలిపారు. అయితే, ఈ రాళ్ల దాడిలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. రాళ్ల దాడికి రైలు అద్దాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. రైలులోని కొందరు ప్రయాణికులు దీనిని వీడియో తీశారు. ఇదిలాఉంటే రాళ్లదాడికి పాల్పడిన దుండగులను పట్టుకునేందుకు గాలింపు కొనసాగుతుందని రైల్వే పోలీసులు తెలిపారు.
డెహ్రాడూన్ నుండి ఢిల్లీలోని ఆనంద్ విహార్ స్టేషన్ వరకు వెళ్లే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును మే 29న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించుకుంటూ వస్తున్నాయి. అయితే, ఆయా ప్రాంతాల్లో గుర్తుతెలియని దుండుగులు ఈ రైళ్లపై రాళ్లదాడికి పాల్పడుతున్నారు. వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు గతంలోనూ వెలుగులోకి వచ్చాయి. గత ఆరు నెలల్లో కేరళ, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటిరాష్ట్రాల్లో వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుపై రాళ్ల దాడి ఘటనలు నమోదయ్యాయి. రైళ్లపై రాళ్లురువ్వడం రైల్వే చట్టం ప్రకారం నేరం. నేరస్థుడు పదేళ్లు వరకు జైలు శిక్షను ఎదుర్కొనే పరిస్థితి కూడా ఉంది. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) అనేక చర్యలు చేపట్టాయి.
Vande Bharat Express: వందేభారత్ రైలుపై రాళ్ల దాడి.. కిటికీ అద్దాలు ధ్వంసం
2023 జనవరిలో డార్జిలింగ్ జిల్లాలో వందే భారత్ ఎక్స్ప్రెస్పై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో రెండు కిటికీలు దెబ్బతిన్నాయి. అదే నెలలో హౌరా నుంచి న్యూ జల్సాయిగురికి వెళ్తున్న రైలుపై మాల్దా సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడికి పాల్పడ్డారు. అదే నెలలో విశాఖపట్టణంలోనూ రాళ్లదాడి జరిగింది. మార్చి 12న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్ ఫరక్కాలో రాళ్ల దాడి ఘటన చోటు చేసుకుంది. ఏప్రిల్ నెలలో విశాఖపట్టణంలో వందేభారత్ ఎక్స్ప్రెస్ పై రాళ్లదాడి జరిగింది. ఈ ఘటనలో రైలు కిటికీ అద్దాలు దెబ్బతిన్నాయి. మే నెలలో కేరళ రాష్ట్రంలో వందేభారత్ ఎక్స్ప్రెస్ పై రాళ్లదాడి జరిగింది. తాజాగా యూపీలోని ముజఫర్నగర్ స్టేషన్ సమీపంలో వందేభారత్ ఎక్స్ప్రెస్ పై రాళ్ల దాడి జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటంతో రైల్వే ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
