Opposition Meet: విపక్షాల సమావేశంలో కీలక నిర్ణయాలు
ఎన్నికల్లో ఐక్యంగా పోరాడాలని నిర్ణయం తీసుకున్నామని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చెప్పారు. అంతేకాదు...
- T Venkateshwarlu
- Published On : June 23, 2023 / 05:24 PM IST
Opposition Meet
Opposition Meet: బిహార్ (Bihar) రాజధాని పాట్నాలో విపక్షాల మెగా సమావేశం ముగిసింది. దాదాపు నాలుగు గంటల పాటు 17 పార్టీలకు చెందిన నేతలు చర్చించారు. తదుపరి సమావేశం జూలై 10 లేదా 12న హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) లోని శిమ్లాలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఎన్నికల్లో ఐక్యంగా పోరాడాలని నిర్ణయం తీసుకున్నామని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చెప్పారు. బీజేపీ దాడులను ఐక్యంగా ఎదుర్కొంటామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. శిమ్లాలో తదుపరి సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. ఎన్నికలకు ఉమ్మడి కార్యాచరణ తయారు చేస్తున్నట్లు తెలిపారు.
మమతా బెనర్జీ వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ తీరుపై సీఎం మమతా బెనర్జీ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. విపక్ష పార్టీల సమావేశంలో ఆమె ఈ విషయాన్ని లేవనెత్తడం గమనార్హం. బెంగాల్లో ఆ పార్టీ తీరును మార్చుకోవాలని చెప్పారు. సహృదయంతో పార్టీలు మెలగాల్సి ఉందని చెప్పుకొచ్చారు.
విపక్షాలు గొడవలు పడితే బీజేపీ లబ్ధిపొందుతుందని అన్నారు. మరోసారి దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఇక భారత్ లో ఎన్నికలు ఉండవని చెప్పారు. రాచరికం కొనసాగుతుందని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో తాము కలిసికట్టుగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడతామని మమతా బెనర్జీ చెప్పారు.
నన్ను పిలవలేదు: అసదుద్దీన్
విపక్షాల సమావేశానికి ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీని ఆహ్వానించకపోవడంపై ఆయన స్పందించారు. తాను నిజాలు మాట్లాడతానని అందుకే తనను పిలవలేదని చెప్పుకొచ్చారు. ప్రధాని అవుతానని నితీశ్ కుమార్ కలలు కంటున్నారని అన్నారు.
Opposition Meet: దేవదాస్ సినిమా డైలాగ్ రీమేక్ చేసి రాహుల్ గాంధీపై అదిరిపోయే సెటైర్ వేసిన బీజేపీ
