West Bengal Assembly Election : పశ్చిమ బెంగాల్ 4వ దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ దశలో 44 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. హౌరా, హూగ్లీ, దక్షిణ 24 పరగణ, అలిపురదౌర్, కూచ్బిహార్ జిల్లాల్లో ఈ స్థానాలు ఉన్నాయి. మొత్తం 44 స్థానాలకు గాను 373 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 2021, ఏప్రిల్ 10వ తేదీ శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. మొత్తం 15 వేల 940 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. నాల్గవదశలో మొత్తం కోటి 15 లక్షల 81 వేల ఓటర్లు ఓటు వేయనున్నారు. ఇందులో 58 లక్షల 82 వేల మంది పురుషులు, 56 లక్షల 98 వేల మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
నాలుగవ దశ ఎన్నికల్లో కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో, బెంగాల్ టీఎంసీఅభ్యర్థి మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ, బీజేపీ తరపున నటి పాయల్ సర్కార్, బీజేపీ ఎంపీ లాకెట్ చటర్జీ, సీపీఎం నేత సుజన్ చక్రవర్తి, మజీ మంత్రి రజీబ్ బెనర్జీ తదితర ప్రముఖులు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో 789 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇందులో 187 కంపెనీలను కూచ్బిహార్ జిల్లాకే కేటాయించారు. బెంగాల్ మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు 8 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు మూడు దశల్లో 91 స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. మే 2న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
Read More : YS Sharmila : దీక్షలతోనే పాలిటిక్స్ లోకి షర్మిల ఎంట్రీ..ఈ రెండు నెలల్లో ఏం చెయబోతున్నారు ?