Arpita Mukherjee: అర్పితా ముఖర్జీ.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. రెండు రోజుల క్రితం పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో స్కూల్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) నియామకాల్లో అక్రమాల వ్యవహారంలో ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) పలువురు మంత్రులు, అధికారుల ఇండ్లలో దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో మంత్రి పార్థా ఛటర్జీతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో అర్పితా ముఖర్జీ కూడా ఒకరు. అర్పితా ముఖర్జీ నివాసంలో సుమారు 21కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా అర్పితా ముఖర్జీ పేరు వార్తల్లో నిలిచింది. ఈ క్రమంలో అసలు అర్పితా ముఖర్జీ ఎవరు? ఆమెకు మమతా ప్రభుత్వానికి ఉన్న సంబంధం ఏమిటి? మంత్రి పార్థ ఛటర్జీకి ఆమెకు మధ్య ఎలాంటి సంబంధం ఉంది అనే విషయాలను తెలుసుకొనేందుకు ప్రజలు ఆసక్తిచూపుతున్నారు.
అర్పిత 2005లో మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి తన కెరీర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత ఆమె కొన్ని బెంగాలీ, ఒడియా సినిమాల్లో నటించారు. ఆమె ప్రసెన్ జిత్ నటించిన ‘మామా భాగ్నే’, దేవ్ నటించిన ‘పార్టనర్’ అనే సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. 2008లో విడుదల అయిన పార్టనర్ సినిమా ఆమె నటించిన తొలి బెంగాలీ సినిమా. అర్పితా పలు ప్రకటనల్లో కూడా నటించారు. నెయిల్ ఆర్ట్ వేయడంలో కూడా శిక్షణ తీసుకున్నారు. ఆమె తమిళ సినిమాల్లో కూడా నటించారు. అర్పితా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తాను చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించి విషయాలను అందులో పోస్టు చేస్తుంటారు.
అర్పిత ముఖర్జీ సినీ నటి, మోడల్ అయినప్పటికీ.. కోల్ కతాలోనే పెద్దదైన దుర్గ పూజా కమిటీలో 2019, 2020లలో ఆమె చురుగ్గా వ్యవహరించారు. ఆ సమయంలోనే అర్పితకు మంత్రి పార్థాఛటర్జీతో పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి ఛటర్జీకి స్నేహితురాలిగా మారారన్న వార్తలు వినిపిస్తున్నాయి. బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తో పలు కార్యక్రమాల్లో అర్పితా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను భాజపా నేత సువేందు అధికారి తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ప్రస్తుతం బెంగాల్ రాష్ట్రంలోనూ, సోషల్ మీడియాలోనూ అర్పితా ముఖర్జీకి మంత్రి పార్థా ఛటర్జీ, మమతకు ఉన్న సంబంధాలపై పలు రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ప్రస్తుత వ్యవహారంపై మమతా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆ పార్టీ నేతలుసైతం దీనిపై పెద్దగా మాట్లాడేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
అర్పితా ముఖర్జీ, మంత్రి పార్థాఛటర్జీ మధ్య సంబంధంపై పలు విధాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అర్పిత దక్షిణ కోల్కతా లోని నకటాల ఉదయన్ సంఘ నిర్వహించే దుర్గా పూజ కోసం కొన్ని ప్రకటనలు చేశారు. ఆ కమిటీకి పార్థ్ ఛటర్జీ అధినేతగా ఉన్నారు. ఇక్కడ జరిగే పూజను కోల్కతాలో అత్యంత భారీగా జరిగే ఉత్సవంగా చూస్తారు. ఈ పూజ మంత్రి నివాసం ఉండే ప్రాంతంలోనే నిర్వహిస్తారు. ఈ ప్రకటన చేసిన తర్వాత వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ఉంటుందని ఈడీ అధికారులు అంటున్నారు. ఈ పూజను మమతా బెనర్జీ ప్రారంభించినప్పుడు స్టేజీ పై అర్పిత కూడా ఉన్నారు. అర్పిత పార్థ్ ఛటర్జీతో కలిసి ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ప్రస్తుత ఈడీ దాడులతో మంత్రితో కలిసి ప్రజలను ఓట్లను అడుగుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదిలాఉంటే అర్పిత ఆమె ఆరోగ్యం గురించి, యోగా, వ్యాయామంకు ప్రాధాన్యత ఇస్తారు. ఆమె సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో తరచుగా యోగా, వ్యాయామం చేస్తున్న ఫోటోలు పోస్ట్ చేస్తుంటారు.
అర్పితకు కోల్ కతాలోని బెల్ ఘారియా ప్రాంతంలో ఓ అపార్ట్ మెంట్లో రెండు ప్లాట్లు ఉన్నాయని తెలుస్తోంది. రెండు నెలల క్రితం వరకూ అర్పిత అక్కడకు తరచు వచ్చి వెళ్లేవారని బెంగాల్ మీడియాలో వార్తలు ప్రసారమయ్యాయి. కొంతమంది ప్రభుత్వ బుగ్గ కారు ఉన్నవారు తరచుగా అక్కడికి వస్తుండేవారన్న ప్రచారమూ ఉంది. అదే ప్రాంతంలో అర్పితకు మరో ఇల్లు ఉన్నట్లు తెలిసింది. అందులో అర్పిత, ఆమె తల్లి, మరికొంత మంది బంధువులు ఉంటున్నట్లు సమాచారం.
ED is carrying out search operations at various premises linked to recruitment scam in the West Bengal School Service Commission and West Bengal Primary Education Board. pic.twitter.com/i4dP2SAeGG
— ED (@dir_ed) July 22, 2022