Tahawwur Rana: తహవూర్ రాణా ఎవరు..? డాక్టర్ టెర్రరిస్టుగా ఎలా మారాడు.. అతడ్ని తీసుకురావడానికి భారత్ చేసిన పోరాటం..
మహానగరం ముంబైలో జరిగిన 26/11 ఉగ్రదాడి కేసులో నిందితుడు తహవ్యూర్ రాణా గురువారం భారత్ కు చేరుకోనున్నాడు.
- Harishth Thanniru
- Published On : April 10, 2025 / 03:01 PM IST
Tahawwur Rana
Tahawwur Rana: మహానగరం ముంబైలో జరిగిన 26/11 ఉగ్రదాడి కేసులో నిందితుడు తహవ్యూర్ రాణా గురువారం భారత్ కు చేరుకోనున్నాడు. తహవూర్ రాణా పాకిస్థాన్ కు చెందిన కెనడా భారతీయుడు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడన్న ఆరోపణలపై 2009లో అరెస్టయ్యాడు. అమెరికా జైల్లో శిక్ష అనుభవించిన అతడిని అప్పగింత ప్రక్రియలో భాగంగా భారత్ కు తీసుకొస్తున్నారు.
ప్రస్తుతం లాస్ ఏంజెలెస్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడిని తమకు అప్పగించాలంటూ కొంతకాలంగా భారత్ పోరాడుతోంది. దీన్ని సవాల్ చేస్తూ తహవూర్ రాణా పలు ఫెడరల్ కోర్టులతోపాటు శాన్ ఫ్రాన్సిస్కోలోని యూఎస్ కోర్టును సైతం ఆశ్రయించాడు. ఆయా న్యాయస్థానాల్లో అతడికి చెక్కెదురైంది. ఈ క్రమంలో గతేడాది నవంబర్ 13వ తేదీన అమెరికా సుప్రీంకోర్టులో రిట్ పిటీషన్ వేయగా అక్కడా నిరాశే ఎదురైంది. అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రాణా దరఖాస్తును తిరస్కరించడంతో భారత్ కు అప్పగించకుండా తప్పించుకోవడానికి చేసిన చివరి ప్రయత్నం విఫలమైన తర్వాత అతన్ని భారతదేశానికి తీసుకువస్తున్నారు. తహవ్యుర్ రాణా భారత్ కు వస్తున్న నేపథ్యంలో కట్టదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అతడిని తరలించేందుకు బుల్లెట్ ఫ్రూప్ వాహనాన్ని వినియోగించనున్నారు. అతన్ని తీహార్ జైలులోని అత్యంత భద్రతా వార్డులో ఉంచే అవకాశాలు ఉన్నాయి.
తహవూర్ రాణా ఎవరు..?
◊ తహవూర్ హుస్సేన్ రాణా 1961 జనవరి 12న పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లోని చిచావత్నిలో జన్మించాడు.
◊ వృత్తిరీత్యా వైద్యుడు. పాకిస్థాన్ ఆర్మీ మెడికల్ కార్పస్ లో కెప్టెన్ జనరల్ డ్యూటీ ప్రాక్టీషనర్ గా పనిచేశాడు.
◊ అతను, అతని భార్య (ఆమె కూడా వైద్యురాలు) 1997లో కెనడాకు వలస వెళ్లారు. 2001లో కెనడియన్ పౌరసత్వం పొందారు.
◊ రాణా ప్రధానంగా చికాగోలో నివసించాడు. చికాగో, న్యూయార్క్, టోరంటోలలో కార్యాలయాలతో కూడిన ఇమ్మిగ్రేషన్ సర్వీస్ ఏజెన్సీ, ఫస్ట్ వరల్డ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ తో సహా అనేకవ్యాపారాలు నిర్వహించాడు.
◊ రాణా, డేవిడ్ కోల్మన్ హెడ్లీ పాకిస్థాన్ లో లష్కరే నిర్వహించిన శిక్షణా శిభిరాలకు హాజరయ్యేవారు.
రాణాను భారత్ కు అప్పగించడానికి దారితీసిన సంఘటనలు..
◊ 2008 (26/11 దాడికి 11 రోజుల ముందు) రాణా ముంబైలోని తాజ్ మహల్ హోటల్ లో బస చేశాడు. ఉగ్రవాదులు దాడి చేసిన ప్రదేశాల్లో ఇది ఒకటి.
◊ 2009 అక్టోబర్ 18 : ప్రవక్త మహమ్మద్ కార్టూన్లను ప్రచురించిన జైలాండ్స్ – పొస్టెన్ వార్తాపత్రిక కార్యాలయాలపై దాడి చేయడానికి కుట్ర పన్నారనే ఆరోపణలపై రాణా, హెడ్లీలను అరెస్టు చేశారు.
◊ 2011 మే16 : తహవూర్ హుస్సేన్ రాణాపై యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో విచారణ ప్రారంభమైంది.
◊ 2011 జూన్9: భారతదేశంలోని ముంబైలో నవంబర్ 2008లో జరిగిన ఉగ్రవాద దాడులకు సంబంధించి ఆరుగురు అమెరికన్లు సహా 160 మందికిపైగా మృతి చెందడానికి సామాగ్రి సహాయం అందించడానికి కుట్ర పన్నారనే అభియోగంపై జ్యూరీ రాణాను నిర్దోషింగా ప్రకటించింది.
◊ 2011జూన్ 10 : ముంబై ఉగ్రవాద దాడులకు భౌతిక మద్దతు అందించడానికి కుట్ర పన్నారనే అభియోగంపై తహవూర్ హుస్సేన్ రాణాను అమెరికా కోర్టు నిర్దోషిగా విడుదల చేయడంపై భారత ప్రభుత్వం నిరాశ వ్యక్తంచేసింది.
◊ 2016 మార్చి -ఏప్రిల్ : డేవిడ్ కోల్మన్ హెడ్లీ తన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సాక్ష్యం సమయంలో తహవూర్ రాణా పాత్ర గురించి వివరాలను అందించాడు.
◊ 2025 జనవరి 21 : తనను భారతదేశానికి అప్పగించడాన్ని సవాలు చేస్తూ రాణా దాఖలు చేసిన పిటిషన్ ను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది.
◊ 2025 ఏప్రిల్ 10 : రాణాను ముంబైకి తీసుకొచ్చారు.
