APJ Abdul Kalam: ఆ హెచ్చరికలతోనే 2014లో ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి డుమ్మా కొట్టిన మాజీ రాష్ట్రపతి కలాం
ముందుగా చెప్పిన సమయానికి నెల రోజుల తర్వాత ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి కలాం వెళ్లారని, అక్కడి కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రసంగించారని, అయితే ఆ సమయంలో ఆర్ఎస్ఎస్ ప్రధాన నాయకత్వం అక్కడ లేదని ఆర్కే ప్రసాద్ వెల్లడించారు. అనంతరం భారత రాష్ట్రపతిగా పని చేసిన ప్రణబ్ ముఖర్జీ 2018లో ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి హాజరయ్యారు. కాంగ్రెస్ నుంచి కుటుంబం నుంచి ఎన్ని ఒత్తిడిలు, విమర్శలు వచ్చినా లెక్క చేయకుండా ఆ కార్యక్రమానికి ప్రణబ్ హాజరవ్వడం గమనార్హం.
- tony bekkal
- Published On : October 15, 2022 / 06:51 PM IST
Why APJ Abdul Kalam Skipped Addressing RSS Event In 2014
APJ Abdul Kalam: భారత మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ఈరోజు. దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నుంచి సామాన్య ప్రజానికం వరకు ఈ జయంతిన ఆయనను తలుచుకుంటున్నారు. దేశానికి ఆయన చేసిన సేవల్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో 2014లో జరిగిన ఒక సంఘటన తాజాగా చర్చకు వచ్చింది. దేశంలోని అనేక మంది మహామహులు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నిర్వహించే కార్యక్రమాలకు హాజరవ్వడం చూస్తూనే ఉన్నాం. ఇలా ఒకసారి కలాంకు కూడా ఆర్ఎస్ఎస్ నుంచి ఒకసారి పిలుపు వచ్చింది. మొదట అందుకు ఆయన అంగీకరించినప్పటికీ, ఆ తర్వాత తన సన్నిహితుల నుంచి వచ్చిన హెచ్చరికల కారణంగా ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారట.
కలాం సెక్రెటరీగా పని చేసిన ఆర్కే ప్రసాద్ తాజాగా రాసిన ‘కలాం: ది అన్టోల్డ్ స్టోరీ’ అనే పుస్తకంలో ఈ ప్రస్తావన చేశారు. కలాం తన నిర్ణయాన్ని మార్చుకోవడంతో ఆర్ఎస్ఎస్ నాయకత్వానికి కోపం వచ్చినట్టు కూడా అందులో పేర్కొన్నారు. కారణం, కలాం రాక కోసం అప్పటికే వారు అన్ని ఏర్పాట్లు చేసి పెట్టుకున్నారు. కానీ, ఉన్నపళంగా తన పర్యటన రద్దు చేసుకోవడంతో వారు తీవ్ర అసహనానికి గురైనట్లు పుస్తకంలో చెప్పుకొచ్చారు.
2014 మేలో కలాం కార్యాలయానికి (అప్పటికి కలాం మాజీ భారత రాష్ట్రపతి) ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రెటరీ రాం మాధవ్ నుంచి ఒక ఆహ్వాన లేఖ వచ్చింది. నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ నేతృత్వంలో శిక్షణ శిబిరాలు కొనసాగుతున్నాయి. ఆ శిబిరాలకు హాజరై ఆర్ఎస్ఎస్ యువ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా ఆ ఆహ్వానంలో కోరారు. ఈ ఆహ్వానానికి ముందుగా కలాం ఒప్పుకున్నారు. అయితే అక్కడికి వెళ్తే ఆర్ఎస్ఎస్ సానుభూతిపరుడని ముద్ర పడుతుందని, అలాగే రైట్ వింగ్ దీనిని తమ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రచారం చేసుకుంటుందని తన స్నేహితులను నుంచి హెచ్చరికలు రావడంతో కలాం తన పర్యటనను రద్దు చేసుకున్నారు’’ అని ‘కలాం: ది అన్టోల్డ్ స్టోరీ’ అనే పుస్తకంలో ఆర్కే ప్రసాద్ చెప్పారు.
అయితే ముందుగా చెప్పిన సమయానికి నెల రోజుల తర్వాత ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి కలాం వెళ్లారని, అక్కడి కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రసంగించారని, అయితే ఆ సమయంలో ఆర్ఎస్ఎస్ ప్రధాన నాయకత్వం అక్కడ లేదని ఆర్కే ప్రసాద్ వెల్లడించారు. అనంతరం భారత రాష్ట్రపతిగా పని చేసిన ప్రణబ్ ముఖర్జీ 2018లో ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి హాజరయ్యారు. కాంగ్రెస్ నుంచి కుటుంబం నుంచి ఎన్ని ఒత్తిడిలు, విమర్శలు వచ్చినా లెక్క చేయకుండా ఆ కార్యక్రమానికి ప్రణబ్ హాజరవ్వడం గమనార్హం.
