×
Ad

Supreme Court : వ్యవసాయ చట్టాలు అమల్లో లేనప్పుడు నిరసనలెందుకు?

నూతన వ్యవసాయ చట్టాలు అసలు అమలులోనే లేనప్పుడు దేనికోసం ఆందోళన చేస్తున్నారని రైతు సంఘాలను సుప్రీం కోర్టు ప్రశ్నించింది.

  • Published On : October 4, 2021 / 04:13 PM IST

Sc On Farmers (1)

Supreme Court నూతన వ్యవసాయ చట్టాలు అసలు అమలులోనే లేనప్పుడు దేనికోసం ఆందోళన చేస్తున్నారని రైతు సంఘాలను సుప్రీం కోర్టు ప్రశ్నించింది.  కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్​మంతర్ దగ్గర సత్యాగ్రహ దీక్ష చేపట్టేందుకు అనుమతించేలా అధికారులకు ఆదేశాలివ్వాలంటూ రైతు సంఘం “కిసాన్ మహా పంచాయత్” దాఖలు చేసిన పిటిషన్​పై ఇవాళ విచారణ చేపట్టిన జస్టిస్ ఏఎమ్ ఖాన్ విల్కర్,సీటీ రవికుమార్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం..సాగు చట్టాలపై స్టే విధించామని, అసలు ఆ చట్టాలు అమలులోనే లేనప్పుడు దేనికోసం ఆందోళన చేస్తున్నారని రైతు సంఘాలను ప్రశ్నించింది.

రైతు సంఘాలను ఉద్దేశించి..మీరు ఎవరికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు? ప్రభుత్వం ఈ నిరసనలను ఎలా అనుమతించవచ్చు? ఈ నిరసనల ప్రామాణికత ఏమిటి? నూతన సాగు చట్టాలపై అత్యున్నత న్యాయస్థానం​ స్టే విధించింది. ప్రస్తుతం ఆ చట్టాలు అమలులో లేవు. రైతులు దేని గురించి నిరసన వ్యక్తం చేస్తున్నారు? వ్యవసాయ చట్టాల చెల్లుబాటును కోర్టు తప్ప మరెవరూ నిర్ణయించలేరు. చట్టాల చెల్లుబాటును సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయించిన తర్వాత వీధుల్లో నిరసన ఎందుకు అని జస్టిస్ ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. ఒకసారి సమస్యపై అత్యున్నత న్యాయస్థానం ముందుకు వచ్చిన తర్వాత.. అదే అంశంపై ఎవరూ రోడ్లపైకి రాకూడదన్నారు సోలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా.

ఈ సందర్భంగా ఉత్తర్​ప్రదేశ్ లోని​ లఖింపుర్​ ఖేరి జిల్లాలో ఆదివారం జరిగిన హింసాత్మక సంఘటనలను అటార్నీ జనరల్​ కేకే వేణుగోపాల్​ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అలాంటి దురదృష్టకర సంఘటనలకు ఎవరూ బాధ్యత వహించరని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది

మరోవైపు,ఢిల్లీ సరిహద్దుల వద్ద రహదారుల దిగ్బంధంపై వివరణ ఇవ్వాలని రాకేశ్​ టికాయిత్​ సహా 40 రైతు సంఘాల నేతలకు నోటీసులు జారీ చేసింది సుప్రీం కోర్టు. రహదారుల దిగ్బంధం సమస్య పరిష్కారానికి ఏర్పాటు చేసిన కమిటీతో చర్చల్లో రైతు సంఘాలు పాల్గొనడం లేదని ఆరోపిస్తూ హర్యాణా ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు..రైతు సంఘాలకు నోటీసులు జారీ చేసింది.

ALSO READ Lakhimpur Kheri..మరణించిన రైతు కుటుంబాలకు రూ. 45లక్షల పరిహారం,ప్రభుత్వ ఉద్యోగం