India-china border : ‘నేనే పార్వతిని..శివుడ్ని పెళ్లాడతాను’ అంటూ భారత్-చైనా బోర్డర్లో మహిళ హల్ చల్

నేనే పార్వతిని..శివుడ్ని పెళ్లాడతాను అంటూ భారత్-చైనా సరిహద్దుల్లో ఓ మహిళ హల్ చల్ చేసింది. దీంతో సదరు మహిళను పోలీసులు..

India China Border

Woman illegally resides at Indo china border : నేనే పార్వతిని..శివుడ్ని పెళ్లాడతాను అంటూ భారత్-చైనా సరిహద్దుల్లో సంచరిస్తున్న ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. ఇండో-చైనా సరిహద్దుకు సమీపంలోని నాభిధాంగ్‌లోని నిషేధిత ప్రాంతంలో చట్టవిరుద్ధంగా ఉంటున్న లక్నోకు చెందిన సదరు మహిళ పేరు హర్మీందర్ కౌర్ గా గుర్తించారు పోలీసులు. తాను పార్వతీదేవినని, కైలాస పర్వతంపై కొలువైన మహా శివుడ్ని పెళ్లాడుతానని చెబుతోంది ఆమె.

ఉత్తరాఖండ్ లోని నభిదాంగ్ ప్రాంతంలో నిషిద్ధ ప్రదేశంలో హర్మీందర్ కౌర్ ఉంటున్న విషయాన్ని గుర్తించిన పితోరాగఢ్ పోలీసులు ఆమెను అక్కడ్నించి ఖాళీ చేయించేందుకు ప్రయత్నించారు. అయితే, తనను బలవంతంగా తీసుకెళితే ఆత్మహత్య చేసుకుంటానని ఆమె బెదిరించింది. దాంతో వెనుదిరిగిన పోలీసులు, ఈసారి మరింత పెద్ద బృందంతో వెళ్లాలని నిర్ణయించారు. తను విడిచిపెట్టాలని పోలీసులతో హర్మీందర్ కౌర్ తీవ్ర వాగ్వాదానికి దిగింది. తనను విడిచిపెట్టకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగింది.

ఈ విషయంపై పితోరాగఢ్ జిల్లా ఎస్పీ లోకేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ఆమె ఉత్తరప్రదేశ్ లోని అలీగంజ్ ప్రాంతానికి చెందిన మహిళ అని..హిమాలయాల్లోని గుంజీ ప్రాంతానికి 15 రోజుల క్రితం తన తల్లితో కలిసి వచ్చిందని, అందుకు ఆమెకు అనుమతులు కూడా ఉన్నాయని తెలిపారు. కానీ ఆమె నిషిద్ధ ప్రాంతంలోకి అడుగుపెట్టడంతో పాటు, అనుమతించిన మేర గత నెల 25తో కాలపరిమితి పూర్తయిందని వెల్లడించారు.

గడుపు పూర్తి కావటంతో ఆమెను అక్కడ నుంచి వెళ్లిపోవాలని చెప్పామని కానీ ఆమె తాను పార్వతీ దేవినని శివుడిని వివాహం చేసుకుంటానంటూ చెబుతోందని అయినా ఆమెను అక్కడ నుంచి ఖాళీ చేయిస్తున్నామని తెలిపారు.

ఇద్దరు ఎస్సైలతో ఒక పోలీసు బృందాన్ని పంపిస్తే ఆమె తిరిగొచ్చేందుకు ఏమాత్రం అంగీకరించకుండా అక్కడే ఉంటానని పట్టుపడుతోందని ఈసారి 12 మందితో పెద్ద బృందాన్ని పంపిస్తామని..ఆమెను నిషేధిత ప్రాంతం నుంచి తీసుకువస్తామని ఎస్పీ లోకేంద్ర సింగ్ వెల్లడించారు. తానే పార్వతీదేవినంటూ చెప్పుకోవడం చూస్తుంటే ఆమె మానసిక స్థితి సరిగా లేదన్న విషయం అర్థమవుతోందని అందుకే పోలీసులతో పాటు వైద్య బృందాన్ని కూడా పంపామని తెలిపారు.