China President : అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్ లో జిన్ పింగ్ అనూహ్య పర్యటన
చైనా ను ఓ వైపు వరదలు ముంచెత్తుతుంటే ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్పింగ్.. సరిహద్దుల్లో పర్యటిస్తున్నారు.
- venkaiahnaidu
- Published On : July 23, 2021 / 07:01 PM IST
Xi
China President ఓ వైపు చైనా ను వరదలు ముంచెత్తుతుంటే ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్పింగ్.. సరిహద్దుల్లో పర్యటిస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు సమీపంలో టిబెట్లోని న్యింగ్చీ పట్టణంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అరుదైన పర్యటన చేపట్టారు. వ్యూహాత్మకంగా కీలకమైన ఈ ప్రాంతాన్ని ఇప్పటివరకు చైనా నాయకులు మాత్రమే అప్పుడప్పుడూ సందర్శించారు. అనూహ్యంగా ఇప్పుడు అధ్యక్షుడే అక్కడ పర్యటించడం చర్చనీయాంశమైంది.
కాగా, గత కొన్ని సంవత్సరాలలో టిబెట్ సరిహద్దులో చైనా అధ్యక్షుడు అధికారికంగా పర్యటించడం ఇదే తొలిసారి. జిన్పింగ్ పర్యటనను మీడియా అత్యంత రహస్యంగా ఉంచింది. ఆయన పర్యటన బుధవారం మొదలుకాగా.. ఆ కార్యక్రమాలను శుక్రవారం ప్రసారం చేయడం గమనార్హం.
బుధవారం ఉదయం న్యింగ్చీ మెయిన్ లింగ్ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న జిన్పింగ్కు స్థానిక ప్రజలు, సంప్రదాయ తెగలు, అధికారులు సాదర స్వాగతం పలికినట్లు జినువా వార్తా సంస్థ తెలిపింది. పర్యటనలో భాగంగా న్యాంగ్ నది వంతెనను జిన్పింగ్ సందర్శించారు. బ్రహ్మపుత్ర నది పరివాహక ప్రాంతంలో పర్యవరణ పరిరక్షణను పరిశీలించారు. సిచువాన్-టిబెట్ రైల్వే ప్రాజెక్టు పనులను కూడా పరిశీలించేందుకు ఆయన నింగ్చి రైల్వే స్టేషన్కు వెళ్లారు. అక్కడ నుంచి ఆయన లాసాకు రైళ్లో వెళ్లారు. లాసా లోని బార్ ఖోర్ ఏరియాలో ఆయన గురువారం స్థానికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న వీడియోలు బయటికొచ్చాయి.
