another shock for mla balakrishna: అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు మరో షాక్ తగిలింది. హిందూపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత పి.రంగనాయకులు వైసీపీలో చేరారు. మంగళవారం(ఫిబ్రవరి 23,2021) రాత్రి ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు.
టీడీపీ ఆవిర్భావం తర్వాత హిందూపురంలో టీడీపీ తరఫున తొలిసారి రంగనాయకులు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో రెండోసారి టీడీపీ నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా, కొంతకాలంగా ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, ఆదర్శ పాలనకు ఆకర్షితులై ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ నాయకత్వాన్ని బలపరుస్తూ వైసీపీలో చేరినట్టు రంగనాయకులు తెలిపారు. రంగనాయకులు ఇద్దరు కుమారులు, అనుచరులు కూడా వైసీపీలో చేరారు.
కాగా, పంచాయతీ ఎన్నికల్లోనూ హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలయ్యకు షాక్ తగిలింది. హిందూపురంలోని 38 స్థానాల్లో 30 చోట్ల వైఎస్సార్ సీపీ మద్దతుదారుల విజయం సాధించారు. ఈ షాక్ నుంచి టీడీపీ శ్రేణులు తేరుకోకముందే, ఇప్పుడు సీనియర్ నాయకుడు పార్టీని వీడారు.