ఏపీ ఎస్ఈసీ(స్టేట్ ఎలక్షన్ కమిషనర్) నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ ను కొనసాగించాలని ఏపీ ప్రభుత్వాన్ని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గవర్నర్ లేఖ పంపారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వకపోవడంతో పాత స్థానాన్ని పునరుద్దరించాల్సిందిగా జగన్ ప్రభుత్వాన్ని గవర్నర్ ఆదేశించారు.
కాగా, ఏపీ హైకోర్టు ఆదేశాలతో గవర్నర్ బిశ్వభూషణ్ను నిమ్మగడ్డ రమేష్ కుమార్ కలిశారు. హైకోర్టు తీర్పును ఆయనకు వివరించారు. తనను తిరిగి ఎస్ఈసీగా నియమించాలంటూ ధర్మాసనం ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోరారు. ఈ మేరకు గవర్నర్కు వినతిపత్రం అందజేశారు. ఎస్ఈసీగా తిరిగి నియమించాలన్న హైకోర్టు తీర్పును గవర్నర్కు తెలియజేశానని, నా విజ్ఞాపనను గవర్నర్ సానుకూలంగా స్వీకరించారని రమేష్ తెలిపారు. గవర్నర్ జోక్యంతో సానుకూల ఫలితం వస్తుందని ఆశిస్తున్నా అన్నారు. ఇంతలోనే గవర్నర్ నుంచి ప్రభుత్వానికి ఆదేశాలు వెళ్లాయి. కాగా, హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను నియమించే అధికారం గవర్నర్కు ఉందని ఉన్నత న్యాయస్థానం గతంలోనే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
అసలేం జరిగిందంటే:
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం 2020 మార్చి 7న షెడ్యూల్ ప్రకటించింది. ఒకపక్క ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగానే మరోపక్క దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరగడం మొదలైంది. షెడ్యూల్ ప్రకారం పోలింగ్ నిర్వహిస్తే కరోనా వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉందని, అందుకే ఎన్నికల ప్రక్రియను ఆరు వారాలు వాయిదా వేస్తున్నామని మార్చి 15న ఎస్ఈసీ రమేష్ కుమార్ ప్రకటించారు. ఎన్నికలు వాయిదా వేస్తూ రమేష్ తీసుకున్న నిర్ణయం వివాదానికి దారితీసింది. ప్రభుత్వం తీవ్రంగా తప్పుపట్టింది. సీఎం జగన్ రమేష్ పై ఫైర్ అయ్యారు. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.
చంద్రబాబు సామాజికవర్గం:
రమేష్ కుమార్ చంద్రబాబు సామాజికవర్గానికి చెందినవారని, ఆ పార్టీకి మేలు చేసేందుకే ఎన్నికలు వాయిదా వేశారని జగన్ తో పాటు మంత్రులు, వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో తనకు రాష్ట్రంలో భద్రత లేదని, కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని మార్చి 18న ఎన్నికల కమిషనర్ కేంద్ర హోం శాఖకు లేఖ రాశారు. అప్పటి నుంచి ఆయన కొంతకాలం హైదరాబాద్ నుంచే విధులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా ఎస్ఈసీ పదవీ కాలాన్ని కుదిస్తూ రమేశ్ కుమార్కు చెక్ పెట్టింది.
నిమ్మగడ్డకు అనుకూలంగా హైకోర్టు తీర్పు:
దీనిపై నిమ్మగడ్డ రమేష్ హైకోర్టును ఆశ్రయించారు. పలుమార్లు విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పునిచ్చింది. కానీ, హైకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. దీనిపై మూడు సార్లు విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వలేదు. దీంతో కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై గవర్నర్కు కలిసి వినతి పత్రం సమర్పించాల్సిందిగా నిమ్మగడ్డను ఆదేశించింది.