Arvind Kejriwal: మోదీ ఓడగానే దేశంలో అవినీతే ఉండదట.. కేజ్రీవాల్ చెప్పిన లాజిక్ ఏంటంటే..?
దేశంలోని అవినీతిపరులు, దొంగలు, చట్టవ్యతిరేకులు అందరూ ఒకే పార్టీలో ఉంటారు. మిగతా పార్టీల్లో ఉన్న అలాంటి వారు కూడా ఇప్పుడు ఆ పార్టీలోకే వెళ్తున్నారు. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇప్పుడు వాళ్ల ప్రభుత్వం ఉంది. ఈరోజు నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా ఉన్నారు. అలా అని ఎప్పటికీ ఆయనే ఉండరు. రేపు వెళ్తారు.
- tony bekkal
- Published On : March 29, 2023 / 05:13 PM IST
Arvind Kejriwal says ED & CBI have brought all the corrupt people of the country in one party
Arvind Kejriwal: దేశంలోని అవినీతిపరులందరినీ ఒకే పార్టీలో చేర్చేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)లు పని చేస్తున్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా జరిగిన చర్చలో బుధవారం ఆయన మాట్లాడుతూ ఇతర పార్టీలో ఉన్న నేతల తలల మీద ఈడీ, సీబీఐ గన్ పెట్టి బెదిరించి, అయితే బీజేపీలో చేరమని, లేదంటే జైలుకు వెళ్తారని బెదిరిస్తున్నాయని ఆయన ఆరోపించారు.
Himanta Biswa Sarma: నాకే కనుక కోర్టు శిక్ష వేస్తే.. రాహుల్ కేసులో కాంగ్రెస్ తీరుపై సీఎం శర్మ ఫైర్
‘‘ఇతర పార్టీ నాయకుల కార్యాలయాల్లో ఇళ్లలో సీబీఐ, ఈడీలు వచ్చి రైడ్లు చేస్తాయి. అనంతరం ఆ నేతల తలల మీద గన్ పెట్టి.. జైలుకు వెళ్తారా, బీజేపీకి వెళ్తారా అని అడుగుతాయి. మనీశ్ సిసోడియాను సైతం ఇలాగే బెదిరించారు. కానీ నేను జైలుకే వెళ్తానని మనీశ్ అన్నారు. చావనైనా చస్తాను కానీ, బీజేపీలోకి వెళ్లనని మనీశ్ అన్నారు. సత్యేంద్ర జైన్ విషయంలో కూడా ఇదే జరిగింది. అదే హిమంత బిశ్వా శర్మ విషయంలో వేరేలా జరిగింది. నిజానికి శర్మ అవినీతి చేశారు. ఈరోజు కాకపోయినా రేపైనా దొరికిపోతామని ఆయన అనుకున్నారు. అందుకే బీజేపీలో చేరారు. నారాయణ రాణేకు కూడా ఇలాగే జరిగింది. సువేంధు అధికారి, ముఖుల్ రాయ్ కూడా అలాగే బీజేపీలో చేరారు. కానీ ఆప్ నేతలు అవినీతి చేయరు. ఎన్ని బెదిరింపులు చేసినా బీజేపీలో చేరరు’’ అని కేజ్రీవాల్ అన్నారు.
Karnataka polls: ప్రజల్ని బిచ్చగాళ్లు అనుకుంటున్నారు.. కాంగ్రెస్ నేత నోట్లు చల్లడంపై సీఎం బొమ్మై
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘దేశంలోని అవినీతిపరులు, దొంగలు, చట్టవ్యతిరేకులు అందరూ ఒకే పార్టీలో ఉంటారు. మిగతా పార్టీల్లో ఉన్న అలాంటి వారు కూడా ఇప్పుడు ఆ పార్టీలోకే వెళ్తున్నారు. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇప్పుడు వాళ్ల ప్రభుత్వం ఉంది. ఈరోజు నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా ఉన్నారు. అలా అని ఎప్పటికీ ఆయనే ఉండరు. రేపు వెళ్తారు. ఎప్పుడైనా వెళ్లొచ్చు. ఎప్పుడైతే మోదీ ప్రధానిగా దిగిపోతారో అప్పుడు ఈ దేశం అవినీతి విముక్తి భారత్ అవుతుంది. ఎందుకంటే అవినీతిపరులంతా ఒకే గదిలో ఉంటారు. వారిని పట్టుకోవడానికి ఎక్కవ శ్రమించాల్సిన అవసరం ఉండదు. బీజేపీ నేతలందరినీ జైలులో వేయగానే దేశం అవినీతి రహిత దేశంగా మారుతుంది’’ అని అన్నారు.
