విజయవాడ: ఈ ఏడాది రిపబ్లిక్ డే, బ్లాక్ డే అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కె.ఏ.పాల్ అన్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న ఇవ్వటంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న పురస్కారం తీసుకునే అర్హత లేదని, గతంలో మేము మా సంస్థ తరుపున అమెరికాలో క్రిమినల్ కేస్ వేశామని శనివారం విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో చెప్పారు. అమెరికా నుండి వచ్చిన అధికారులు ఆయనకు సమన్లు కూడా ఇచ్చారని, ప్రణబ్ ముఖర్జీ చాలా క్రిమినల్ కేస్ లు ఎదుర్కొన్న వ్యక్తని కే.ఏ పాల్ తెలిపారు. ప్రణబ్ ముఖర్జీ చెప్పింది ఎప్పుడు చేయలేదని, ప్రధాన మంత్రి మోడీ ప్రణబ్ కు భారతరత్న అవార్డు ఎందుకు ఇచ్చారో చెప్పాలని పాల్ డిమాండ్ చేశారు.
ప్రణబ్ ముఖర్జీ కరుడుగట్టిన ఆర్.ఎస్.ఎస్. సానుభూతి పరుడని, బ్రాహ్మణుడు అవటంవలన ఆయనకు భారతరత్నఇచ్చారని పాల్ మండిపడ్డారు.లోక్ సభలో మెజారిటీ ఉంది అని ఎవరికి పడితే వారికి అవార్డు ప్రదానం చేస్తారా ? అని పాల్ ప్రశ్నించారు. ప్రపంచ శాంతి కోసం పాటుపడి, లోక్ సభ స్పీకర్ గా సేవలందించిన బలయోగికి అవార్డు ఎందుకివ్వలేదని ఆయన అన్నారు. బాలయోగి దళితుడిని అవార్డు ఇవ్వలేదా ? తెదేపా కనీసం ఆ దిశగా కృషి చేయలేదని పాల్ టీడీపీ ని ప్రశ్నించారు.