Mamata Banerjee
Prime Minister Post: భారతీయ జనతా పార్టీని వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు దేశంలోని 26 విపక్ష పార్టీలు ‘ఇండియా’ అనే పేరుతో ఐక్యమైన విషయం తెలిసిందే. అయితే ఆ కూటమి నుంచి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. బహుశా ఎన్నికలు అయిపోయాక.. ప్రధాని అభ్యర్థిని ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాని పదవిపై తమకు ఆరాటం లేదని కాంగ్రెస్ పార్టీ బెంగళూరు మెగా సమావేశానికి ముందే తేల్చి చెప్పింది. ఇక ప్రధానమంత్రి పదవికి పోటీదారని ప్రచారం జరుగుతున్న తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం ఈ విషయమై ఓ క్లారిటీ ఇచ్చారు.
ప్రధానమంత్రి కావాలనే కోరిక ఏదీ తనకు లేదని, కాషాయ పార్టీని సాగనంపాలన్నదే తన కోరిక అని స్పష్టం చేశారు. టీఎంసీ వార్షిక అమరవీరుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం కోల్కతాలో నిర్వహించిన ర్యాలీలో మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. ”ఏ కుర్చీపైనా నాకు కోరిక లేదు. బీజేపీ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి, గద్దెదింపాలని మాత్రమే నేను కోరుకుంటున్నాను” అని అన్నారు.
కేంద్రంలోని బీజేపీని అధికారం నుంచి తొలగించేందుకే కొత్తగా విపక్ష కూటమి ‘ఇండియా’ ఏర్పాటైందని మమతా బెనర్జీ చెప్పారు. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే ప్రజాసామ్యం చచ్చిపోయిందనడానికి అది సంకేతమమవుతుందని హెచ్చరించారు. 2024లో బీజేపీని అధికారం నుంచి తప్పించాలనే డిమాండ్ మినహా తమకు కుర్చీల మీద ఎలాంటి కోరిక లేదని స్పష్టం చేశారు. అంతకు ముందు విపక్షాల తరపు ప్రధని అభ్యర్థి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆయన డిప్యూటీ తేజశ్వీ యాదవ్ పలుమార్లు ఈ ప్రకటన చేశారు. అయితే ఆయన కూడా ప్రధాని అభ్యర్థిత్వం నుంచి తప్పుకున్నారు.