×
Ad

Botcha Satyanarayana : ప్రజలను అలా అడిగే ధైర్యం చంద్రబాబుకు ఉందా?- మంత్రి బొత్స

Botcha Satyanarayana : భగవద్గీత లాంటి మేనిఫెస్టోను తూచ తప్పకుండా పాటించాం. చెప్పింది చేశామని మేం గర్వంగా చెప్పగలం. చంద్రబాబు హయాంలో అన్ని రంగాల్లోనూ రాష్ట్రం వెనుకుంది.

  • Published On : May 30, 2023 / 09:50 PM IST

Botcha Satyanarayana (Photo : Google)

Botcha Satyanarayana : టీడీపీ మేనిఫెస్టోపై వైసీపీ నాయకులు, మంత్రుల మాటల దాడి కొనసాగుతోంది. మహానాడు వేదికగా చంద్రబాబు విడుదల చేసిన టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోపై విమర్శలు ఎక్కుపెట్టారు అధికార పార్టీ నాయకులు. అది మేనిఫెస్టో కాదు మాయఫెస్టో అని ఎద్దేవా చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని నిలదీస్తున్నారు. మేనిఫెస్టో పేరుతో మరోసారి ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు రెడీ అయ్యారని ఆరోపించారు. తాజాగా టీడీపీ మేనిఫెస్టో పై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు.

” మేం టీడీపీకి ఎందుకు భయపడతాం? వాళ్లేమైనా రాక్షసులా..? పులులా..? మేం ఎందుకు భయపడతాం..? టీడీపీ ఓ రాజకీయ పార్టీ. వాళ్లేం సన్నాసులు కాదు. ఓ పార్టీగా మేనిఫెస్టోను టీడీపీ విడుదల చేసింది. చంద్రబాబు గతంలో కూడా మేనిఫెస్టోని ప్రకటించారు. అమలు చేయకుండా మాయలు చేశారు. వాళ్ల మేనిఫెస్టో గురించి చెప్పేదేమీ లేదు.

Also Read..Seetharam Thammineni : బ్లాక్ కమాండోస్ లేకపోతే.. చంద్రబాబు ఫినిష్- స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు

నాలుగేళ్ల పాలన పూర్తైంది. భగవద్గీత లాంటి మేనిఫెస్టోను తూచ తప్పకుండా పాటించాం. చెప్పింది చేశామని మేం గర్వంగా చెప్పగలం. చంద్రబాబు హయాంలో అన్ని రంగాల్లోనూ రాష్ట్రం వెనుకుంది. ఇప్పుడు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ముందున్నాం. విద్యా రంగంలో సమూల మార్పులు తెచ్చాం. విద్యార్థుల సంఖ్యను పెంచాం. జిల్లాకో మెడికల్ కాలేజీ పెట్టాం. ఆరోగ్యశ్రీ సేవల సంఖ్యను పెంచాం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తెచ్చాం. నాలుగేళ్లలో మంచి జరిగిందా..? చెడు జరిగిందా..? ప్రజలే చెబుతారు. మా పరిపాలన బాగుంటే మమ్మల్ని గెలిపించండని ధైర్యంగా సీఎం జగన్ అడుగుతున్నారు. మరి అలా అడిగే ధైర్యం చంద్రబాబుకు ఉందా?” అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.

Also Read..Mandali Buddha Prasad : చంద్రబాబు ఫినిష్.. స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర ఉంది, సీబీఐ విచారణ జరిపించాలి- మండలి బుద్ధ ప్రసాద్