Chalo Medigadda : తెలంగాణలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాటర్ వార్ పీక్ స్టేజ్కి వెళ్లింది. కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ను టార్గెట్గా చేసుకొని విమర్శలు చేస్తోంది. ఇప్పుడు అదే ప్రాజెక్టును ఆయుధంగా చేసుకొని హస్తం పార్టీపై కౌంటర్ అటాక్ ప్రారంభించింది గులాబీ పార్టీ. ఇందులో భాగంగా మార్చి 1 నుంచి చలో మేడిగడ్డ కార్యక్రమానికి పిలుపునిచ్చిన బీఆర్ఎస్.. కాళేశ్వరం సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇదే సమయంలో నీటి పోరు యాత్రలో భాగంగా కరీంనగర్లో భారీ బహిరంగ సభకు కూడా ప్లాన్ చేసింది.
నీటి పోరు యాత్రలకు బీఆర్ఎస్ పిలుపు..
పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గులాబీ పార్టీ ప్రజాక్షేత్రంలో ఉండేలా కార్యాచరణ అమలు చేస్తోంది. కృష్ణా జలాల వినియోగంపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఇటీవల నల్లగొండలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గిన కాంగ్రెస్.. కృష్ణా జలాలపై హక్కులను కోల్పోయేలా చేసిందని ఆరోపించింది. ఈ విషయంలో కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ నీటి పోరు యాత్రలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్.
కాళేశ్వరం ఓ విఫల ప్రాజెక్టు అని చెప్పే ప్రయత్నం..
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసింది. అయితే.. ఈ ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ ఎన్నికలకు ముందు కుంగిపోయిన విషయం వెలుగు చూసింది. అప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. బీఆర్ఎస్ వైఖరిని ఎండగట్టేందుకు అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై శ్వేత పత్రం విడుదల చేసింది. కాళేశ్వరం ఓ విఫల ప్రాజెక్టు అని.. బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేసింది. అంతేకాదు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించిన సీఎం రేవంత్రెడ్డి.. బ్యారేజీలోని లోపాలను ఎత్తిచూపారు.
కాంగ్రెస్కు కౌంటర్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ కార్యాచరణ..
అయితే.. బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్కు కౌంటర్ ఇచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. నల్లగొండ సభా వేదికగా తాము కూడా మేడిగడ్డకు వెళ్లి వాస్తవాలను ప్రజలకు వివరిస్తామని మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మేడిగడ్డ మాత్రమే కాదని, ప్రాజెక్టులో ఇది ఒక బ్యారేజీ మాత్రమేనని చెబుతోంది బీఆర్ఎస్. ఈ క్రమంలోనే మార్చి ఒకటో తేదీ నుంచి చలో మేడిగడ్డ కార్యక్రమానికి పిలుపునిచ్చింది బీఆర్ఎస్. 150 నుంచి 200 మంది బీఆర్ఎస్ ప్రతినిధులతో మేడిగడ్డను సందర్శించి.. వాస్తవాలను ప్రజలకు వివరిస్తామని ప్రకటించారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అంతేకాదు.. తమ వెంట సీఎం రేవంత్రెడ్డితో పాటు మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఎవరైనా రావొచ్చని పిలుపునిచ్చారాయన.
ఈ సభ ద్వారా పార్లమెంట్ ఎన్నికల ప్రచార శంఖారావం..
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందన్న విమర్శలు చేస్తున్న ప్రభుత్వం.. ఎలాంటి విచారణ అయినా జరుపుకోవచ్చని ప్రకటించింది బీఆర్ఎస్. మేడిగడ్డలో కొంత భాగం దెబ్బతిన్నప్పటికీ నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందంటున్న గులాబీ పార్టీ.. ప్రభుత్వం దానిపై దృష్టి పెట్టాలని హితవు పలుకుతోంది. మరోవైపు గోదావరి జలాల వినియోగంపై చేపట్టనున్న నీటి పోరు యాత్రలో భాగంగా.. మార్చి 10న కరీంనగర్లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ సభ ద్వారా పార్లమెంట్ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.
మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రజల్లోకి తీసుకెళ్లేలా దశలవారీగా పలు కార్యక్రమాలు అమలు చేసే నిర్ణయం తీసుకుంది గులాబీ దళం. మేడిగడ్డ తర్వాత మిగతా బ్యారేజీలు, రిజర్వాయర్లను కూడా సందర్శించేందుకు ఏర్పాట్లు చేశారు బీఆర్ఎస్ నేతలు.
Also Read : దమ్ముంటే.. ఒక్క సీటు గెలిచి చూపించు- కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్