కరీంనగర్‌లో కరోనా హై అలర్ట్ : కలెక్టరేట్ రోడ్డు దిగ్భందం..హోటల్స్, దుకాణాలు బంద్

  • Publish Date - March 19, 2020 / 12:40 AM IST

కరీంనగర్‌లో కరోనా డేంజర్‌ బెల్‌ మోగింది. ఇండోనేషియా నుంచి కరీంనగర్‌కు వచ్చిన వారిలో ఏకంగా ఏడుగురికి కోవిడ్‌ పాజిటివ్‌ రావడంతో ఆందోళన మొదలైంది. స్థానికులను భయాందోళనకు గురిచేసింది. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం కరీంనగర్‌ పట్టణంలో హై అలర్ట్‌ ప్రకటించింది. కలెక్టరేట్‌కు మూడు కిలోమీటర్ల మేర అధికారులు దిగ్బంధించారు. ఎవరినీ అటువైపు వెళ్లనీయడం లేదు. అక్కడ ఉన్న వారిని బయటకు రానివ్వడం లేదు. అందరినీ ఒక రకంగా గృహ నిర్భంధం చేశారు.

ఈనెల 14న ఇండోనేషియాకు చెందిన 10 మంది మత ప్రచారకులు కరీంనగర్‌కు వచ్చారు. ఢిల్లీ నుంచి రైలులో రామగుండం చేరుకున్నారు. అక్కడి నుంచి ఆటోలో కరీంనగర్‌ వచ్చారు. ప్రార్థనా మందిరంలో మత కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ఈనెల 16న అధికారులు విదేశాల నుంచి వచ్చారని గుర్తించి.. వారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కరోనా లక్షణాలు కనిపించడంతో వారందరినీ హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీలో వీరికి శాంపిల్స్‌ సేకరించి పుణె ల్యాబ్‌కు పంపారు. రాత్రి రిపోర్ట్స్‌ అందగా అందులో ఏడుగురికి కోవిడ్ పాజిటివ్‌ వచ్చింది.

See Also | తెలంగాణలో కరోనా పంజా : ఇండోనేషియా వాసులకు పాజిటివ్

ఇండోనేషియా దేశస్థులకు పాజిటివ్‌ రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కలెక్టరేట్‌లో  పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌.. కలెక్టర్‌, శశాంక, సీపీ కమలాసన్‌రెడ్డి, ఇతర అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇండోనేషియా వ్యక్తులు కరీంనగర్‌లో 48 గంటలపాటు ఉన్నట్టు గుర్తించామని.. ఆ సమయంలో సంచరించిన ప్రాంతాలను, కలిసిన వ్యక్తులను గుర్తించామని గంగుల తెలిపారు.

కలెక్టరేట్‌ పరిధిలోని ఓ ప్రార్థనామందిరంలో గడిపినట్టు గుర్తించామని,  కలెక్టరేట్‌ కేంద్రంగా మూడు కిలోమీటర్ల పరిధిలోని ప్రతి ఇంట్లో వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. 2020, మార్చి 19వ తేదీ గురువారం నుంచి వంద వైద్య బృందాలను రంగంలోకి దింపుతున్నట్టు తెలిపారు. ప్రజలు నాలుగు రోజుల పాటు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కోరారు. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు కరీనంగర్‌ కలెక్టర్‌. వైరస్‌ను వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీనికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 

ముందు జాగ్రత్త చర్యగా కలెక్టరేట్‌ ఎదురుగా ఉన్న రోడ్డును పూర్తిగా మూసివేశారు. దుకాణాలు, హోటళ్లు మూసివేయించి అటువైపు ఎవరినీ అనుమతించడం లేదు. వారు బస చేసిన ప్రార్థనా మందిరాలను రసాయనాలతో శుభ్రపరిచారు. ఆ ప్రాంతమంతా  మందులు, బ్లీచింగ్‌ పౌడర్‌ స్ర్పే చేశారు. అంతేకాదు 144 సెక్షన్‌ను విధించి ఎవరినీ ఆ ప్రాంతంలోకి అనుమతించడం లేదు. 

కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో 20 ఐసొలేషన్‌, 10 ఐసీయూ బెడ్లను ఏర్పాటు చేశారు. రెండు ప్రైవేటు ఆస్పత్రుల్లో 50 చొప్పున బెడ్స్‌ను సిద్ధం చేశారు. కరీంనగర్‌ నగరమంతటా శానిటైజేషన్‌ చేశారు. జన సమూహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి.. ప్రజలను గుమికూడవద్దని ప్రచారంచేస్తున్నారు. అత్యవసరంగా చికిత్స అందజేసేందుకు ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ బృందాలను రంగంలోకి దింపేందుకు ప్రయత్నిస్తున్నారు.