Karnataka: పార్కింగ్ రద్దీతో చిర్రెత్తుకొచ్చి సీఎం కారుకే అడ్డు తిరిగాడు.. తర్వాత ఏం జరిగిందంటే?
సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అతని ఇంటి ముందు చాలా వాహనాలు పార్క్ చేస్తున్నారు. దీంతో వృద్ధుడు తన వాహనాన్ని బయటకు తీయలేకపోయారు. ఈ రోజువారీ సమస్యతో ఇబ్బంది పడిన ఈ వృద్ధుడి సహనం చివరకు కట్టలు తెంచుకుంది.
- tony bekkal
- Published on- July 28, 2023 / 04:15 PM IST
Neighbour Stops CM Car: బెంగళూరులోని కుమారకృపా రోడ్డులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారిక నివాసం ఉంది. సీఎం నివాసం వెలుపల భద్రతతో పాటు, ఆయనను కలిసేందుకు వీవీఐపీల వాహనాలు క్యూ కట్టడంతో కుమారకృపా రోడ్డులో నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అక్కడే నరోత్తం అనే వృద్ధుడి ఇల్లు కూడా ఉంది. నరోత్తమ్ కూడా తన కారు బయటికి తీసేందుకు ఇబ్బంది పడుతున్నారు. అలా అని మిగతా వారిలా ఆయన మౌనంగా ఉండలేదు. ఏకంగా సీఎం కాన్వాయ్ నే ఆపి తన నిరసన వ్యక్తం చేశారు.
సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అతని ఇంటి ముందు చాలా వాహనాలు పార్క్ చేస్తున్నారు. దీంతో వృద్ధుడు తన వాహనాన్ని బయటకు తీయలేకపోయారు. ఈ రోజువారీ సమస్యతో ఇబ్బంది పడిన ఈ వృద్ధుడి సహనం చివరకు కట్టలు తెంచుకుంది. గురువారం సీఎం తన నివాసం నుంచి బయటకు వస్తుండగా.. సీఎం కాన్వాయ్ ముందు ఆయన బైఠాయించారు. పోలీసులు ఆయనను తొలగించేందుకు ప్రయత్నించినా మొండిగా అక్కడే ఉండిపోయాడు.
ఇంతలో సీఎం ఈ విషయాన్ని గమనించి తన కారు అద్దాన్ని కిందకు దించారు. తన ఇంటి ముందు చాలా మంది పోలీసులు, ఇతర వ్యక్తులు వాహనాలు నిలుపుతున్నారని, దీంతో వాహనం దిగి ఇంటి నుంచి బయటకు రావడానికి ఇబ్బందిగా ఉందని సీఎంకు వృద్ధుడు ఫిర్యాదు చేశారు. సిద్ధరామయ్య వెంటనే తన భద్రతకు సంబంధించిన అధికారిని పిలిపించి, తన పరిసరాల్లో నివసించే ప్రజలకు భవిష్యత్తులో అలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
INDIA Meet: విపక్షాల మూడవ సమావేశానికి ఖరారైన తేదీలు.. ఎప్పుడో తెలుసా?
దీనిపై గత ఐదేళ్లుగా నిరంతరం పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నానని, ఇప్పటి వరకు తన సమస్యకు పరిష్కారం లభించలేదని, సిద్ధరామయ్య సీఎం అయిన తర్వాత తన సమస్య మరింత పెరిగిందని వృద్ధుడు వాపోయారు. ముఖ్యమంత్రి దగ్గర నివసించే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చామని, అయితే విధుల్లో ఉన్న పోలీసులు మాత్రం భయంతో వీవీఐపీల వాహనాలను తొలగించేందుకు వెనుకాడుతున్నారని సీఎం భద్రతకు సంబంధించిన అధికారి ఒకరు తెలిపారు.
