Bhatti Vikramarka Mallu : కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే.. దాన్ని రద్దు చేస్తాం, రూ.2లక్షలు రుణమాఫీ చేస్తాం, ఫ్రీగా 9 రకాల సరుకులిస్తాం- భట్టి విక్రమార్క
Bhatti Vikramarka : మీ భూములు మీకు పంచుతాం. ధరణి అనే భూతాన్ని బంగాళాఖాతంలో కలుపుతాం. ఉచిత రేషన్ బియ్యంతో పాటు..
- Naveen
- Published On : May 25, 2023 / 09:12 PM IST
Bhatti Vikramarka
Bhatti Vikramarka – People March : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. అంతేకాదు.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఉద్యోగం వచ్చేవరకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మహిళా మండలాలకు రూ.2లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వడంతో పాటుగా ఫ్రీగా రేషన్ బియ్యం, సరుకులు కూడా ఇస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. జడ్చర్లలో పీపుల్స్ మార్చ్ బహిరంగ సభలో భట్టి విక్రమార్క మాట్లాడారు.
దేశ ప్రజాస్వామ్యం ఖూనీ..
” ఆదిలాబాద్ పిప్పిరి నుండి జడ్చర్ల వరకు 800 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగించాను. పీపుల్స్ మార్చ్ రాజకీయాల కోసమో ఎన్నికల కోసమో ఏర్పాటు చేసింది కాదు. ఈరోజు దేశ ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన నిలబడితే కష్టాలు పెడుతున్నారు. కర్ణాటక ప్రజలు బీజేపీని ఓడించి ప్రజాస్వామ్యాన్ని బతికించారు. మీరు రాహుల్ గాంధీని ఇంటి నుండి ఖాళీ చేయిస్తే కర్ణాటక ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపారు.(Bhatti Vikramarka)
ధరణి మహమ్మారి పేరుతో..
సోనియమ్మ తెచ్చిన ఫారెస్ట్ యాక్ట్ ను తీసేసి అడవి బిడ్డలను కష్ట పెడుతున్నారు. ధరణి మహమ్మారి పేరుతో భూములు లాక్కుంటే మేము ఎవరికి చెప్పుకోవాలని అడవి బిడ్డలు ఆవేదన చెందుతున్నారు. ఇంద్రవెల్లి కుమ్మరి తాండాలో అడవి బిడ్డలను బయటికి వెళ్లమంటూ రాష్ట్ర ఫ్రభుత్వం ఇబ్బందులు పెడుతోంది. ఆనాటి ఇందిరమ్మ రాజ్యాన్ని మళ్లీ తీసుకురావడానికి మీవెంట మేముంటాం అంటూ అడవి బిడ్డలు మాకు హామీ ఇస్తున్నారు.
కార్మికుల ఆవేదన, నిరుద్యోగుల కంటతడి..
సింగరేణి బొగ్గు బావులను కాపాడమంటూ కార్మికులు ఆవేదన చెందుతున్నారు. నిరుద్యోగులు తమకు భరోసా లేదని కన్నీరు పెడుతున్నారు. బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ 5వేల కోట్ల విలవైన భూములను పంపిణీ చేస్తే తిరిగి ఆ భూములను లాక్కుంటున్నారు. కాంగ్రెస్ ఫ్రభుత్వం రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు 24లక్షల ఎకరాలు పంచింది.(Bhatti Vikramarka)
2లక్షల ఉద్యోగాలు, రూ.2లక్షల రుణమాఫీ..
మీ కోసం మేము మీ వెంటే ఉంటాం. 5 నెలల్లో కాంగ్రెస్ ఫ్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మీ భూములు మీకు పంచుతాం. ధరణి అనే భూతాన్ని బంగాళాఖాతంలో కలుపుతాం. పాలమూరు జిల్లాలో ప్రాజెక్టుల పేరిట ముంపు గ్రామాల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 2013 చట్టాన్ని అమలు పరచాలని ముంపు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. గతంలో కట్టిన ప్రాజెక్టులతో పాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కూడా మేమే ప్రారంభిస్తాం. ఉచిత రేషన్ బియ్యంతో పాటు ఇంటి సరుకులు ఇస్తాం. గ్యాస్ బండను రూ.500కే ఇస్తాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలిస్తాం. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇస్తాం. మహిళా మండలాలకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తాం” అని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.
హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు, ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, అనిరుద్ రెడ్డి తదితరులు ఈ సభలో పాల్గొన్నారు.
