Uttam Kumar Reddy
Uttam Kumar Reddy : గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రాజెక్టుల పేరుతో భారీ అవినీతి జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. దీనిపై విచారణ జరుగుతోందన్న ఆయన నివేదికలు వచ్చాక చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు.
”BRS లాగా కాళేశ్వరం ప్రాజెక్టును నిషేధిత ప్రాంతంగా మేము పెట్టలేదు. BRS నేతలతో పాటు కేసీఆర్ వెళ్లి చూసి రాష్ట్రానికి క్షమాపణ చెప్పాలి. BRS నేతలకు కాళేశ్వరం చూపించాలని అధికారులకు మేము ఆదేశించాము. కాళేశ్వరం ప్రాజెక్టులా ఇంతటి కరప్షన్, నిర్లక్ష్యం జరగలేదు. వేల కోట్లు దోచుకుని, ఫ్రాడ్ చేసి మేమేదో తప్పు చేసినట్లు మమ్మల్ని విమర్శిస్తున్నారు.
గత ప్రభుత్వంలో కమిషన్ల కోసం ప్రాజెక్టులు కట్టారు. ఇంకా ప్రాజెక్టు పూర్తి కావడానికి ఒక లక్ష 47వేల కోట్లు కావాలి. కాళేశ్వరంలో 25వేల కోట్ల పనులు ఎలాంటి DPR లేకుండా పనులు అలాట్ చేశారు. ఐదేళ్లలో 160 టీఎంసీల నీళ్లను మాత్రమే లిఫ్ట్ చేశారు. ఇరిగేషన్ కోసం ఉపయోగించింది 65 టీఎంసీలే. ప్రతీ ఏటా కాళేశ్వరం నుంచి 6లక్షల 50వేల ఎకరాలకు మాత్రమే నీళ్ళు ఇచ్చారు.
BRS తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి జిమ్మికులు చేస్తోంది. BRS నేతలు మేడిగడ్డపై నిజాలు చెప్పకుండా.. తప్పుడు ప్రచారం చేస్తున్నారు. BRS నిర్లక్ష్యం వల్ల మేడిగడ్డ పూర్తిగా కొలాప్స్ అయింది. BRS ఉచిత సలహాలు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉంది. మేడిగడ్డను NDSA కు అప్పగించాము. NDSA నివేదిక ఆధారంగా భవిషత్ చర్యలు ఉంటాయి. ఇరిగేషన్ పై విజిలెన్స్ రిపోర్ట్ అందింది. విజిలెన్స్ రిపోర్ట్ పై న్యాయ సలహాలు తీసుకుంటాం. లీగల్ ఒపీనియన్ తీసుకున్నాక చట్టపరమైన చర్యలు ఉంటాయి.
కేసీఆర్.. కాళేశ్వరం పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. కేటీఆర్ డిప్రెషన్ లో మాట్లాడుతున్నారు. అన్నారంలో లిఫ్ట్ చేసే నీళ్ళు కూడా లేవు” అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.