ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీదే విజయం, రాజమండ్రి నగరాన్ని 165 చదరపు కిమీ విస్తరింపజేస్తాం

  • Publish Date - November 19, 2020 / 11:00 AM IST

mp margani bharat: ఏపీలో స్థానిక ఎన్నికల మంటలు కొనసాగుతున్నాయి. ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమని ఎన్నికల కమిషన్ అంటుంటే, ప్రభుత్వం మాత్రం నో అంటోంది. కరోనా తగ్గిందని ఈసీ అంటుంటే, కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ పై అధికార పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు. నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు తొత్తులా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.

తాజాగా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ స్థానిక ఎన్నికల పై స్పందించారు. ప్రజల ఆరోగ్యం కంటే ఎన్నికలు ముఖ్యం కాదని ఆయన అన్నారు. ప్రభుత్వంపై చంద్రబాబు, నిమ్మగడ్డ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో ఎన్నికలు జరుపుతారా అని ఎస్ఈసీని ప్రశ్నించారు. కాగా, ఇప్పటికే 25శాతం స్థానాలు వైసీపీ ఏకగ్రీవం అయ్యాయని చెప్పిన ఎంపీ భరత్, ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీదే విజయం అని నమ్మకం వ్యక్తం చేశారు.

రాజమండ్రి నగరాన్ని 165 చదరపు కిలోమీటర్లకు విస్తరింపజేస్తామని ఎంపీ తెలిపారు. 9 మున్సిపాలిటీలతో రాజమండ్రి అర్బన్ డెవలప్ అథారిటీ ఏర్పాటు చేస్తామన్నారు. మూడు వరసలతో రాజమండ్రి-కాకినాడ కెనాల్ రోడ్ నిర్మాణం చేపడతామన్నారు. రాజమండ్రిలో అభివృద్ధి పనులకు రూ.200 కోట్ల ప్రత్యేక గ్రాంట్ ఇచ్చామన్నారు.