New Parliament -BRS : నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి హాజరయ్యే విషయంలో బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవానికి దూరంగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పార్టీ నిర్ణయాన్ని రేపు (మే 27) అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.
28వ తేదీన కొత్త పార్లమెంట్ భవనాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. అయితే, కాంగ్రెస్ పార్టీ సమన్వయంతో ఇప్పటికే 19 పార్టీలు పార్లమెంట్ ప్రారంభోత్సవానికి దూరంగా ఉండాలని డెసిషన్ తీసుకున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి బీఆర్ఎస్ కూడా చేరినట్లు తెలుస్తోంది.
కొత్త పార్లమెంట్ భవనాన్ని మే 28న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఇప్పుడీ వ్యవహారం దుమారం రేపుతోంది. రాజకీయ రగడకు దారితీసింది. పార్లమెంటును ప్రధాని మోదీతో కాకుండా రాష్ట్రపతితో ప్రారంభింపజేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకి చేరింది. రాష్ట్రపతితో ప్రారంభించేలా లోక్ సభ సెక్రటేరియట్ కు, కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టులో పిల్ వేశారు. అయితే, ఈ పిల్ పై విచారణ జరిపేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం నో చెప్పింది.
సుప్రీంకోర్టు న్యాయవాది సీఆర్ జయ సుకిన్ వేసిన పిల్ పై జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహాతో కూడిన ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ‘‘మీరు ఇలాంటి పిటిషన్లను ఎందుకు దాఖలు చేస్తున్నారో మాకు తెలుసు. దీన్ని స్వీకరించడానికి మేము సిద్ధంగా లేము’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. ‘‘మీకు ఎలాంటి జరిమానా విధించనందుకు సంతోషించండి’’ అంటూ హెచ్చరికలు కూడా జారీ చేసింది. వ్యాజ్యాన్ని కొట్టివేయాలని బెంచ్ నిర్ణయించింది. కోర్టు వ్యాఖ్యలతో తన పిల్ ను ఉపసంహరించుకునేందుకు పిటిషనర్ అనుమతి కోరారు.
నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ బహిష్కరణపై భావసారూప్యత కలిగిన 19 ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. నూతన పార్లమెంటును నిర్మించిన నిరంకుశ పద్ధతిని మేము అంగీకరరించం అని తేల్చి చెప్పాయి. రాష్ట్రపతి ముర్ముని పూర్తిగా పక్కనపెట్టి, కొత్త పార్లమెంటు భవనాన్ని స్వయంగా ప్రారంభించాలని ప్రధాని మోదీ నిర్ణయించడం రాష్ట్రపతిని అవమానించడమేనని.. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం ఒక ముఖ్యమైన సందర్భం అని.. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని విమర్శించాయి.
శతాబ్దానికి ఒకసారి సంభవించే మహమ్మారి సమయంలో భారత దేశ ప్రజలు లేదా ఎంపీలతో ఎటువంటి సంప్రదింపులు చేయకుండానే చాలా ఖర్చుతో కొత్త పార్లమెంటు భవనం నిర్మించబడింది. వారి కోసం దీన్ని నిర్మించుకున్నారు. ప్రజాస్వామ్యం ఆత్మ పార్లమెంటు నుండి బయటకు వచ్చినప్పుడు, కొత్త భవనంలో ప్రజాస్వామ్యానికి విలువ కనిపించదు. అందుకే, కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని సమిష్టి నిర్ణయం తీసుకున్నట్లు 19 పార్టీలు ప్రకటించాయి. ఈ నిరంకుశ ప్రధానికి, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశాయి.