జయం మనదే : రాబోయేది కొత్త ప్రధాని – బాబు

  • Publish Date - May 11, 2019 / 01:23 AM IST

పార్లమెంట్ స్థానాల వారీగా సమీక్షలు చేస్తున్న టీడీపీ అధినేత  చంద్రబాబు మే 10వ తేదీ శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం పార్లమెంట్  స్థానాలపై రివ్యూ చేశారు..ఉదయం శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని  ఏడు అసెంబ్లీ స్థానాల నాయకులతో చంద్రబాబు సమీక్ష  జరిపారు…చంద్రబాబు మాట్లాడారు. మోడీ, జగన్ లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రతి కార్యకర్త రాజకీయాలను అధ్యయనం చేసే స్థాయికి  చేరాలని అన్నారు. రాష్ట్రానికి న్యాయం కోసమే తెలుగుదేశం పార్టీ  ధర్మపోరాటం చేసిందన్న ఆయన… దేశ వ్యాప్తంగా బీజేపీ మోడీ, బీజేపీ ప్రభ తగ్గుతోందన్నారు. బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టి.. బీజేపీకి ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయగలిగామని చెప్పారు. 

ఓటమి నైరాశ్యంతోనే నరేంద్రమోడి చౌకబారు వ్యాఖ్యలు  చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు..ఫ్రస్టేషన్ తోనే మోడి దిగజారి  మాట్లాడుతున్నారని..ఎప్పుడో 26ఏళ్ల క్రితం చనిపోయిన రాజీవ్  గురించి మాట్లాడటం సరికాదన్నారు..దేశానికి రాబోయేది కొత్త  ప్రధానే అని.., మోడి ప్రధానిగా ఇకపై ఉండరని నేతలకు స్పష్టం  చేశారు. టిడిపితో పెట్టుకున్నప్పుడే మోడి పతనం ప్రారంభం  అయ్యిందని అయ్యిందని… ఐదు కోట్ల ప్రజల ప్రయోజనాల కోసమే  మోడీపై తిరగబడ్డామని స్పష్టం చేశారు.

అనంతరం ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నాయకులతో విడివిడిగా  చర్చించారు చంద్రబాబు. సాయంత్రం విజయనగరం పార్లమెంట్‌  స్థానంపైనా చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ  కచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీసీ  ఓటుబ్యాంకు నిలబెట్టుకుంటూనే  ఎస్సీ,ఎస్టీ, ముస్లిం, మైనార్టీ ఓట్లు  పెంచుకున్నామని చెప్పారు. దుష్టశక్తులన్నీ ఏకమై టీడీపీకి  వ్యతిరేకంగా పనిచేశాయని…జగన్‌మోహన్‌రెడ్డి దుర్మార్గాలకు  నరేంద్రమోడీ, కేసీఆర్‌ అరాచకాలు తోడయ్యాయని చెప్పారు.  ఇంతమంది కుట్రలు పన్నినా ప్రజలు టీడీపీ వెంటే నిలబడ్డారని  నేతలకు వివరించారు. 

డ్వాక్రా మహిళలు, ఫించన్ల లబ్దిదారుల ఓట్లు టీడీపీకే పడ్డాయని  అన్నారు. బూత్‌ కమిటీ, ఏరియా కమిటీ, ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల అసెస్‌మెంట్లు తీసుకున్నామని.. కచ్చితంగా టీడీపీ విజయం సాధిస్తుందని చెప్పారు. కొన్ని స్థానాల్లో కీలక నాయకులకు సొంతబూత్‌లో తక్కువ ఓట్లు రావడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం  చేశారు. ఎంత రాష్ట్ర స్థాయి నాయకుడైనా సొంత బూత్‌లో, స్వగ్రామంలో, సొంత నియోజకవర్గంలో ఆధిక్యత ఉంటేనే పార్టీలో ఇకపై విలువ, గౌరవం ఉంటుందన్నారు. కౌంటింగ్‌ రోజు  తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు.

ఒకవైపు ఫలితాలపై విశ్లేషణ చేస్తూనే…రాబోయే ఎన్నికల్లో కుప్పం  ఫార్ములాను అమలులోకి తీసుకొచ్చేలా సూచనలు చేశారు. ప్రతి  పార్లమెంటు నియోజకవర్గంలో కుప్పం స్థాయిలో ఒక అసెంబ్లీ  ఉండేలా ప్రయత్నాలు చేయాలన్నారు. అటు శ్రీకాకుళం పార్లమెంట్  పరిధిలో కొంతమంది నాయకులు సమావేశానికి  హాజరుకాకపోవడంపైనా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.