Sajjala Ramakrishna Reddy : ఆమె.. వాళ్లతో కలవడం మా దురదృష్టం, అవినాశ్ అలాంటి వ్యక్తి కాదు- సజ్జల హాట్ కామెంట్స్
Sajjala Ramakrishna Reddy : నేనే నరికి చంపాను అని చెబుతున్న వాడిని బయటకి వదిలేశారు. ఆటో నడుపుకునే వ్యక్తి సెటిల్ మెంట్స్ చేసుకుంటూ కార్లలో తిరుగుతున్నాడు. అసలు సంబంధం లేని వ్యక్తిని ఇబ్బంది పెడుతున్నారు.
- Naveen
- Published On : May 19, 2023 / 04:33 PM IST
Sajjala Ramakrishna Reddy
YS Avinash Reddy : మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకి సంబంధించి ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. వైఎస్ వివేకా కూతురు సునీత.. టీడీపీతో వాళ్లతో కలవడం తమ దురదృష్టం అన్నారు సజ్జల. వాళ్లతో కలిసి కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వివేకా కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఎక్కడికో పారిపోతున్నట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఈ వ్యవహారంలో కొన్ని చానల్స్ సృష్టించే వార్తలకు మేము సమాధానం ఇవ్వలేము అని ఆయన స్పష్టం చేశారు. అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు హాజయ్యే ఉద్దేశ్యంతోనే హైదరాబాద్ వెళ్లారని చెప్పారు. అయితే, తన తల్లికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో అవినాశ్ రెడ్డి కడప వెళ్లారని చెప్పారు.
ఇప్పటికీ ఐదారు సార్లు అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారని గుర్తు చేసిన సజ్జల.. మళ్ళీ విచారణకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. విచారణ తప్పుడు మార్గంలో ఉందని, అందుకే అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ కి అప్లయ్ చేశారని వెల్లడించారు. సహేతుకమైన కారణంతోనే బెయిల్ పిటిషన్ వేశారని వివరణ ఇచ్చారు సజ్జల.
” ఈరోజు కాకపోతే రేపైనా వెళ్తారు. విచారణ ఎదుర్కొంటారు. సీబీఐ అరెస్ట్ చేయబోతోంది అని టీడీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. సీబీఐకి సమాచారం ఇచ్చే అవినాశ్ రెడ్డి కడప వెళ్లి ఉంటారు. విచారణ తప్పించుకోవడానికి తల్లికి బాగోలేదని చెప్పే వ్యక్తి కాదు అవినాశ్. అలాంటి చండాలమైన ఆలోచనలు టీడీపీ వాళ్ళకి వస్తాయి.
నేనే నరికి చంపాను అని చెబుతున్న వాడిని బయటకి వదిలేశారు. ఆటో నడుపుకునే వ్యక్తి సెటిల్ మెంట్స్ చేసుకుంటూ కార్లలో తిరుగుతున్నాడు. అసలు సంబంధం లేని వ్యక్తిని ఇబ్బంది పెడుతున్నారు. వివేకా హత్యలో అవినాష్ పాత్ర ఉంటే 3 నెలలు దర్యాప్తు చేసిన చంద్రబాబుకు తెలియదా..? ఆనాడు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న AB వెంకటేశ్వరరావుకి ఈ విషయం తెలియదా..? మా తప్పు ఉంటే సీబీఐ విచారణకు ఎందుకు అంగీకరిస్తాం? మా దురదృష్టం ఏంటంటే.. సునీతమ్మ వాళ్ళతో కలవడం.
వాళ్ళతో కలిసి ఈ కుట్ర చేస్తున్నారు. సీబీఐ విచారణలో విషయాలు బయటకు ఎందుకు వస్తున్నాయి..? ఎలా వస్తున్నాయి..? మీడియాపై దాడి అవినాశ్ కి తెలిసి జరిగి ఉండదు. మీడియాపై దాడి దురదృష్టకరం. మేము ఖండిస్తున్నాం. అవినాశ్ ఏమైనా క్రిమినలా? వెంట పడటానికి. మీడియాకు కొంత నియంత్రణ ఉండాలి” అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
