Sasikala hot comments on AIADMK
AIADMK: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం అనంతరం అన్నాడీఎంకే పార్టీ నేతలు మూడు ముక్కలుగా చీలిపోయారు. వాస్తవానికి పార్టీ ఒకరి చేతిలోనే ఉన్నప్పటికీ.. ప్రధానమైన ముగ్గురు నాయకులే మూడు రకాలుగా విడిపోయారు. ఏ ఇద్దరు నేతలు కలుస్తారన్నా ఆశ్చర్యం కలిగేంత దూరం వీరి మధ్య పెరిగిపోయింది. విపక్ష పార్టీలతో వైరం కంటే వీరి మధ్యే ఎక్కువ పోరు సాగుతుందనే విశ్లేషణలు లేకపోలేదు.
Wayanad: రాహుల్ గాంధీ కోల్పోయిన వయనాడ్ నియోజకవర్గంలో తొందరలో ఎన్నిక?
ఆ ముగ్గురు నేతల్లో ఒకరు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి. ప్రస్తుతం అన్నాడీఎంకే అధినేతగా ఉన్నారు. ఇక మరొకరు మాజీ ఉప ముఖ్యమంత్రి, జయలలిత నమ్మినబంటు పన్నీర్ సెల్వం. ఈయను కొద్ది రోజుల క్రితమే పళనిస్వామి వర్గం పార్టీ నుంచి బహిష్కరించింది. ఇక జయలలిత నిచ్చెలి శశికళ. జయలలిత మరణం అనంతరం పార్టీని తన గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేసి అనంతరం కాలంలోనే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన నేత.
తమ పార్టీ ఒకటేనని, తామంతా ఏకమవుతామని తాజాగా శశిశకళ అన్నారు. వాస్తవానికి ఆమె పళనిస్వామి పేరు బయటికి తీయలేదు. కానీ పన్నీర్ సెల్వం పేరైతే ప్రస్తావించారు. త్వరలో ఓపీఎస్ తనను కలుసుకునే అవకాశం ఉందని, తామంతా ఒకే పార్టీకి చెందినవారం కాబట్టి ఎప్పుడైనా కలుసుకుని రాజకీయ పరిస్థితులపై చర్చిస్తామన్నారు. విడిపోయినవారందరినీ ఏకతాటిపైకి తెచ్చి లోక్సభ ఎన్నికల్లో అన్ని చోట్లా గెలిచి తీరుతామని శశికళ ధీమా వ్యక్తం చేశారు.