Fadnavis And Shinde
Maharashtra: మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు ఎప్పుడు ఎలా మారతాయో అస్సలు ఊహించలేము. దేశ రాజకీయాలతో పోలిస్తే ఇక్కడి రాజకీయాలు కూడా భిన్నంగా ఉంటాయి. ఎవరు ఎప్పుడు ఎవరితో చేతులు కలుపుతారో, ఎవరు ఎప్పుడు పొత్తును తెంచుకుంటారో ఊహించడం కూడా కష్టంగానే ఉంటుంది. శివసేనలోని మెజారిటీ ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకుని, బీజేపీ (BJP)తో చేతులు కలిపి ముఖ్యమంత్రి అయ్యారు ఏక్నాథ్ షిండే (Eknath Shinde). ఈ పరిణామం జరిగి ఏడాది కూడా పూర్తి కాలేదు. తాజాగా అజిత్ పవార్ (Ajit Pawar) కూడా ఇలాంటి ఆలోచనే చేస్తున్నట్లు మరాఠా మీడియా కోడై కూస్తోంది. ఎన్సీపీ(NCP)లోని సుమారు 40 మంది ఎమ్మెల్యేలను అజిత్ పవర్ తన వెంట బెట్టుకుని బీజేపీతో చేతులు కలపనున్నట్లు గట్టి ప్రచారమే జరుగుతోంది.
వాస్తవానికి దీనిపై అజిత్ పవార్ సహా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) సైతం వివరణ ఇచ్చారు. ఇవన్నీ మీడియాలో వస్తున్న ఊహాగాణాలని, వాస్తవం కాదని శరద్ పవార్ చెప్పగా.. తన చివరి శ్వాస వరకు ఎన్సీపీలోనే కొనసాగుతానని అజిత్ పవార్ అన్నారు. అయినప్పటికీ ఈ విషయమై ఏక్నాథ్ షిండే ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ షిండేకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. అయితే ఈ కుర్చీ తనకు ఎంతో కాలం ఉండదని షిండే ముందు నుంచి ఆందోళనలో ఉన్నారట. అందుకే ప్రస్తుతం అజిత్ పవార్ మీద వస్తున్న ప్రచారంతో ఆయన ఆందోళన ఎక్కువైందట.
Rahul Gandhi : రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేవరకూ అరువు ఇవ్వను : షాప్ యజమాని పోస్టర్
దీంతో భారతీయ జనతా పార్టీకి ఆయన బాహాటంగానే హెచ్చరిక జారీ చేశారు. అజిత్ పవార్తో కనుక బీజేపీ చేతులు కలిపితే తాము పొత్తు నుంచి విడిపోతామని శివసేన హెచ్చరిస్తోంది. ‘‘మా పాలసీ చాలా స్పష్టంగా ఉంది. మా నేతలపై ఎన్సీపీ బెదిరింపులకు పాల్పడింది. మేం అధికారంలో ఉన్నప్పటికీ ఎన్సీపీతో కలిసేది లేదు. ఒకవేళ ఎన్సీపీతో చేతులు కలపాలని బీజేపీ అనుకుంటే అందుకు మహారాష్ట్ర అంగీకరించదు. మేం కూడా బీజేపీతో పొత్తు తెంపుకుంటాము. ఎందుకంటే కాంగ్రెస్, ఎన్సీపీలతో వెళ్లడానికి ప్రజలు అంగీకరించరు’’ అని శివసేన నేత షిర్సాత్ అన్నారు.